
హైదరాబాద్: బాల్ టాంపరింగ్కు పాల్పడి ముగ్గురు ఆటగాళ్లు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు అంటేనే మైండ్గేమ్కు పెట్టింది పేరు.
ముఖ్యంగా ఈ జట్టులోని ఆటగాళ్లు స్లెడ్జింగ్తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తారు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి దెబ్బకొట్టడం వారు బాగా అలవాటు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పుడే రెచ్చగొట్టే, మానసిక స్థెర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్సీజీ)లో ఛానల్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న కమిన్స్ మాట్లాడుతూ "నేను ధైర్యంగా జోస్యం చెబుతున్నా. ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేడని అనుకుంటున్నా. వాళ్ల(భారత్)ను ఆసీస్ గడ్డపై పూర్తిగా కట్టడిచేస్తాం" అని అన్నాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ యావరేజి 53.4గా ఉంటే, ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ యావరేజి 62గా ఉండటం విశేషం.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్కు ఇచ్చిన ఇంటర్యూలో మాజీ క్రికెటర్ మెక్గ్రాత్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ముందుగా కోహ్లీపై ఒత్తిడి పెంచాలి. సిరీస్ను ఆస్ట్రేలియా గెలవాలంటే కోహ్లీనే లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా ఆడాలి. అతడిది దూకుడుగా ఆడే స్వభావం. అతడిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో కోహ్లీ ఎలా ఒత్తిడిని అధిగమిస్తాడో చూడాలి. కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడు" అని అన్నాడు.
"అతడే ఒత్తిడికి గురైతే తప్పకుండా జట్టులోని మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు. దీన్ని అవకాశంగా చేసుకుని ఆసీస్ విజయాలు సాధించాలి. త్వరలోనే ఇరు జట్ల మధ్య కఠినమైన, అద్భుతమైన పోరాటాన్ని చూడబోతున్నాం. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం కట్టుదిట్టమైన బౌలింగ్ లైనప్తో పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు ఆ జట్టుకు అదనపు బలం. ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ లేకపోవడం కూడా ఆ జట్టుకు కలిసి రానుంది" అని మెక్గ్రాత్ అన్నాడు.
డిసెంబర్ 6న అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. భారత్తో చివరిసారిగా సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరిస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ రెండు టెస్టుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 500కుపైగా పరుగులు చేయడం విశేషం.
కాగా, డిసెంబర్లో టీమిండియాతో జరిగే నాలుగు టెస్టులకు ఆతిథ్యమిస్తోన్న అడిలైడ్, బ్రిస్బేన్, మెల్ బోర్న్, సిడ్నీ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి.