దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓడించాడు. భిన్నమైన క్రీడలు ఆడే ఇద్దరూ ఎలా పోటీపడ్డారనే సందేహం వచ్చిందా? అవును, నిజంగానే వారిద్దరూ పోటీపడ్డారు. ఆటలో కాదు 'ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు రేసులో తలపడ్డారు. ఓటింగ్ తీర్పుతో ప్రకటించే ఈ అవార్డును విరాట్ కోహ్లి అందుకున్నాడు.
దిగ్గజ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, మహ్మద్ అలీ, మైకేల్ జొర్డాన్ వంటి ఎంతో మంది ప్లేయర్లు కూడా ఈ అవార్డు రేసులో నిలబడ్డారు. కానీ ఫైనల్ స్టేజ్కు మెస్సీ, కోహ్లి మాత్రమే చేరుకున్నారు. తమ ఆటలో ఈ ఏడాది అత్యుత్తమంగా సత్తాచాటిన వారిని ఓటింగ్తో విజేతగా ప్రకటిస్తారు. అంతిమంగా కోహ్లి విన్నర్గా నిలిచాడు.

విరాట్ కోహ్లికి 2023 ఏడాది కమ్బ్యాక్ ఇయర్గా మారింది. వరుస వైఫల్యాలు, తీవ్ర విమర్శలను దాటుకుంటూ మునపటి విరాట్లా సూపర్ ఫామ్లోకి ఈ ఏడాదే తిరిగొచ్చాడు. అసాధారణ రికార్డులు బద్దలుకొడుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు. పరుగుల వరద పారిస్తూ ఈ ఏడాది కూడా భారత్కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు మెస్సీని కాదని అవార్డు అందుకోవడంతో 2023 సంవత్సరం కోహ్లికి మరింత స్పెషల్గా మారింది.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో అత్యుతమ సెంచరీల రికార్డును కోహ్లి (50) ఈ ఏడాదిలోనే బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో సచిన్ (49) రికార్డును అధిగమించాడు. అంతేగాక ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ మరో రెండు రికార్డులను కోహ్లి నెలకొల్పాడు.
ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో 765 పరుగులు చేసిన విరాట్ ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. మరోవైపు ఏడు భిన్నమైన క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రికెట్లో 2000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర లిఖించాడు.