టీమిండియాకు బిగ్ షాక్. ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా యాజమాన్యం, సెలక్టర్లతో కోహ్లి చర్చించి తీసుకున్నాడని బీసీసీఐ వివరిస్తూ ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది.
''ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు వ్యక్తిగత కారణాలతో వైదొలగడానికి విరాట్ కోహ్లి బీసీసీఐని అభ్యర్థించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా మేనేజ్మెంట్, సెలక్టర్లతో కోహ్లి మాట్లాడాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం తన తొలి ప్రాధాన్యత అని, కానీ కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వల్ల తాను వెళ్లాల్సి వస్తుందని కోహ్లి వివరించాడు. బీసీసీఐ అతడి నిర్ణయాన్ని గౌరవించింది''
''అంతేగాక ఆ స్టార్ బ్యాటర్కు బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ మద్దతు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లి గోప్యత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మీడియాను, అభిమానులను బీసీసీఐ అభ్యర్థిస్తుంది. టెస్టు సిరీస్లో వచ్చే సవాళ్లపై దృష్టి పెడుతూ భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరుతుంది'' అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం కోహ్లి ఆదివారమే హైదరాబాద్కు చేరుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరాడు. అయితే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కోహ్లి వెళ్లాడని భావించారు. కానీ అయోధ్య వేడుకలో కోహ్లి ఫొటోలు బయటకు రాకపోవడంతో అతడు రాలేదని తర్వాత నిర్ధారించుకున్నారు. కాగా, జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే అయిదు టెస్టు సిరీస్లో తొలి టెస్టు ఉప్పల్ వేదికగానే జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్టులు రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్
తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్