హైదరాబాద్: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ తనదైన శైలిలో ఆటగాళ్లకు స్పూర్తిగా నిలుస్తూ భారత జట్టుకు వరుస విజయాలను అందిస్తున్నాడు. ఫార్మెట్ ఏదైనా సరే గెలుపే లక్ష్యంగా కోహ్లీసేన బరిలోకి దిగుతోంది.
అటు వ్యక్తిగత రికార్డులతో పాటు, ఇటు భారత జట్టుకు వరుస విజయాలను అందించాడు. కోహ్లీ కెప్టెన్సీలోని యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనకు తోడు, మైదానంలో కోహ్లీ తీసుకునే కొన్ని నిర్ణయాలు జట్టుని విజయాల వైపు నడిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నాడు.

ముఖ్యంగా అటు టెస్టు క్రికెట్తో, ఇటు వన్డే క్రికెట్లో కోహ్లీ విజయాల్లో టాస్ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఒక కెప్టెన్గా కోహ్లీ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. టెస్టుల్లో 16 సార్లు టాస్ నెగ్గితే అందులో 15 సార్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం.
ఇక, వన్డేల్లో ఇప్పటి వరకు 16 సార్లు టాస్ గెలిచిన కోహ్లీ 14 సార్లు ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న సిరిస్లో కూడా కోహ్లీ ఓ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశాడనే చెప్పాలి. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మూడు సార్లు టాస్ గెలిచిన కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయవంతమయ్యాడు.

ఇక ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో మూడు సార్లు టాస్ నెగ్గితే రెండు సార్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేదనలో 64 ఇన్నింగ్స్లోనే కోహ్లీ 4వేల పరుగుల మైలురాయి అందుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
వన్డేల్లో ఛేజింగ్కే ఎక్కువ మొగ్గు చూపుతున్న కోహ్లీ, టెస్టుల్లో మాత్రం అందుకు భిన్నంగా బ్యాటింగ్ తీసుకుని విజయం సాధిస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లకు కోహ్లీ కెప్టెన్సీ వహించగా.. అందులో 26 వన్డేల్లో గెలవగా, 7 మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్ టైగా ముగిసింది.

ఇక టెస్టుల్లో 29 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ 19 విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వగా, ఏడు టెస్టులు డ్రాగా ముగిసాయి.