
టెస్టుల్లో చెత్త ఫామ్..
గతేడాది మొత్తం 11 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ.. మొత్తమ్మీద గతేడాదిని చాలా చప్పగా ముగించాడు. గతేడాది అతను 26 సగటుతో కేవలం 260 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మళ్లీ ఫామ్ అందుకున్న కోహ్లీ.. తను ఆడిన చివరి ఏడు ఇన్నింగ్సుల్లో మూడు శతకాలతో రాణించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్లో పంత్, అయ్యర్ వంటి కీలకమైన మిడిలార్డర్ ఆటగాళ్లు లేకపోవడంతో బ్యాటింగ్ భారం అంతా కోహ్లీపైనే పడనుంది.

కోహ్లీ బ్యాటు మాట్లాడుతుంది..
అయితే కోహ్లీ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఈ సిరీసులో కోహ్లీ కచ్చితంగా రాణిస్తాడని టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన భజ్జీ.. 'ఈ సిరీసులో విరాట్ కోహ్లీ బ్యాటు ఘాటుగా మాట్లాడుతుందని అనిపిస్తోంది. ఒకసారి పరుగులు చేయడం మొదలు పెడితే.. కోహ్లీ ఫామ్ ఆగదు. ఈ సిరీస్లో టీమిండియా బాగా ఆడాంటే మన రన్ మెషీన్ రాణించాల్సిందే. బ్యాటింగ్ భారాన్ని తను తీసుకొని భారీ స్కోర్లు చేయాలి' అని భజ్జీ చెప్పాడు.

ఆసీస్పై ఎదురు దాడి చేస్తాడు..
'గతంలో ఏమైందో మర్చిపోండి. తన టెక్నిక్లో సమస్య ఉందా? ఇంకేమైనా కూడా అదంతా అయిపోయింది. ఇప్పుడంతా బాగానే ఉంది. కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడు' అని హర్భజన్ వివరించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కోహ్లీ అద్భుతంగా ఆడతాడని, ఆ జట్టు బౌలర్లపై పూర్తి ఇంటెన్సిటీతో ఎదురు దాడి చేస్తాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. 'బంగ్లా టూర్లో కోహ్లీ పరుగులు చేయలేదు నిజమే. కానీ ఇప్పుడు అదంతా అనవసరం. కోహ్లీ వంటి ఆటగాళ్లు ఫామ్ అందుకుంటే వాళ్లు ఎన్నో మ్యాచులు గెలిపిస్తారు. మన టీంను డబ్ల్యూటీసీ ఫైనల్ చేర్చాల్సిన సమయం ఇది' అని హర్భజన్ వివరించాడు.


Click it and Unblock the Notifications












