
నాగ్పూర్ టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియాకు భారత మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో కోహ్లీ చాలా డేంజరస్గా మారతాడని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కోహ్లీకి బాగా కలిసొచ్చిన స్టేడియం. అతను ఇక్కడ చివరగా ఆడిన టెస్టు మ్యాచులో కోహ్లీ డబుల్ సెంచరీతో రాణించాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచులో తన కెరీర్ బెస్ట్ స్కోరు 243 సాధించాడు.
ఈ నేపథ్యంలోనే గవాస్కర్.. కోహ్లీ ఈ టెస్టులో రాణిస్తాడని భావిస్తున్నాడు. గతేడాది చివర్లో టీ20, వన్డే ఫార్మాట్లలో ఫామ్ అందుకున్న కోహ్లీ.. టెస్టు క్రికెట్లో ఇంకా ఫామ్ అందుకోలేదు. మూడేళ్లకుపైగా ఈ ఫార్మాట్లో సెంచరీ బాదలేకపోయాడు. అయితే వన్డేల్లో అతని ఫామ్ చూసిన వాళ్లంతా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను రాణిస్తాడని అంచనా వేశారు. కానీ తొలి టెస్టులో క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన అతను.. తనకు దక్కిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అయితే రెండో టెస్టులో అతను ఈ సెంచరీ కరువును తీర్చుకుంటాడని గవాస్కర్ నమ్మకం వ్యక్తం చేశాడు.
'ఇప్పటికి ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. ఇంకా మూడు టెస్టు మ్యాచులు ఉన్నాయి. అతని స్థాయి ఆటగాడు ప్రతి మ్యాచులోనూ రాణించాలని అనుకోవడం సహజం. అయితే అతను బ్యాటింగ్ చేసింది ఒక్క ఇన్నింగ్స్ అని మర్చిపోకూడదు. కాబట్టి తన హోం గ్రౌండ్ ఢిల్లీలో అతను సెంచరీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నా' అని గవాస్కర్ చెప్పాడు. తొలి టెస్టులో అరంగేట్రం చేసిన స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్లో కోహ్లీ అవుటైన సంగతి తెలిసిందే. అప్పటికి అతను 26 బంతులు ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే చేశాడు.