Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. థ్రిల్లర్స్ను తలపిస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లల్లో ఘన విజయాలను సాధించింది. నాలుగు పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది.
సీఎస్కే తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటుతోంది. ఆడిన రెండింట్లోనూ గెలుపు బావుటా ఎగురవేసింది. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది సంజు శాంసన్ టీమ్. గురువారం రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను 12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్లో, అనంతరం బౌలింగ్లో రాణించిందీ జట్టు.

టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ బోణీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఐపీఎల్లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్లు ఏవైనా ఉన్నాయా అంటే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్సే.
రోహిత్ శర్మకు కేప్టెన్సీ తొలగించిన తరువాత ఎదుర్కొంటోన్న తొలి ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లల్లో చతికిల పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత కేప్టెన్ హార్దిక్ పాండ్యా శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇకపై ప్రతి మ్యాచ్నూ గెలిపించితే గానీ అవి తొలగిపోయేలా లేవు.
ఈ పరిస్థితుల్లో- ఐసీసీ వరల్డ్ కప్ 2024లో సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ వెలువడింది. ఈ టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ టీమిండియా ఇన్నింగ్ను ఆరంభిస్తాడంటూ టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ అంచనా వేశాడు. రోహిత్ శర్మకు బదులుగా కోహ్లీ ఓపెనర్ అవతారం ఎత్తే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు.
ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా ఆడుతున్నాడని, అదే అతన్ని టీ20 ఫార్మట్లో సాగే వరల్డ్ కప్కు ఓపెనర్గా పంపిస్తుందని పేర్కొన్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో ప్రస్తుతం ఓపెనర్లుగా ఉంటోన్న రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్లల్లో ఒకరిని బ్యాటింగ్ లైనప్లో కిందికి పంపి, విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించవచ్చని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీ.. ఐసీసీ వరల్డ్ కప్ 2024లో కనిపించకపోవచ్చని మహ్మద్ కైఫ్ తేల్చి చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ హోమ్ గ్రౌండ్ బెంగళూరులో పంజాబ్ కింగ్స్పై విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు.
టీ20ల్లో 12,000 పరుగులను అందుకున్న విషయాన్ని ఉదహరించాడు కైఫ్. అటు ఐపీఎల్లో కూడా 7,000 పరుగుల ల్యాండ్ మార్క్ను అధిగమించాడు కోహ్లీ. ఐసీసీ వరల్డ్ కప్ 2024లో కోహ్లీని టీమిండియా ఓపెనర్గా ఆడించగలిగితే ఇదే దూకుడును ప్రదర్శిస్తాడని, అది బ్యాటింగ్ లైనప్గా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నాడు.