
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దురదృష్టవంతుడని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టాపార్డర్ పేలవ ప్రదర్శన కారణంగా 18 పరుగులతో ఓడిపోయి టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో టాపార్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి భారత క్రికెట్ జట్టుని విజయం ముంగిట వరకు తీసుకెళ్లారు. అయితే, చివర్లో ధోని రనౌట్ కావడంతో మ్యాచ్ కివీస్ వైపుకు మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శన పట్ల భారత అభిమానులు గర్వపడాలని షోయబ్ అక్తర్ అన్నాడు.
సెమీఫైనల్లోనే టీమిండియా నిష్క్రమించడంపై షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ "ఐదుగురు టాప్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్లో పూర్తిగా నిరాశ పరిఛారు. రోహిత్ శర్మ ఓ అద్భుత బంతికి ఔటయ్యాడు. కానీ, కోహ్లీ మాత్రం దురదృష్టవంతుడు. కోహ్లీ ఆడిన బంతి బెయిల్స్ని అలా టచ్ చేస్తూ వెళ్లింది. అయితే, ఫీల్డ్ అంపైర్ దానిని ఔట్గా ప్రకటించాడు" అని అన్నాడు.
"ఈ మ్యాచ్లో టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జడేజా క్రీజులోకి వచ్చేంత వరకు ఆటలో మజానే లేదు. ఇక, ధోని సైతం విజయంపై ఆశలు రేకెత్తించాడు. ధోని రనౌట్ అవుతాడని ఎవరైనా ఊహించి ఉంటారా? అయినా ధోని ఎప్పటికీ లెజెండే. క్రికెట్కు తానో గొప్ప అంబాసిడర్" అని షోయబ్ అక్తర్ అన్నాడు.
"అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచకప్లో జట్టుని ఫైనల్కు తీసుకువెళ్లలేకపోయాడు. ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచకప్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ప్రదర్శన పట్ల భారత అభిమానులు గర్వపడాలి" అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.