డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన ప్లేస్కు వెళ్లి ఈ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఈ క్రమంలోనే లండన్ వెళ్లాడు. సెలవులను లండన్లో ఎంజాయ్ చేయడం కోహ్లీకి చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా అక్కడకు వెళ్లిపోయాడు. తాజాగా అతను లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలవగానే.. తను మళ్లీ వాంఖడేలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీ కూడా వాంఖడేలో బ్యాటింగ్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ క్రమంలోనే వాంఖడేలో ఆడే సమయంలో ఆనాటి క్షణాలు మళ్లీ గుర్తొస్తాయని, తను ఇక్కడ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

మరికొన్ని రోజుల్లో భారత్, వెస్టిండీస్ టెస్టు సిరీస్ మొదలవుతుంది. దీని కోసం కోహ్లీ కూడా విండీస్ వెళ్తాడు. దీనికి ముందు దొరికిన సెలవులు దొరకడంతో తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. లండన్ వీధుల్లో కనిపించిన కోహ్లీ తెల్ల టీషర్ట్, నల్ల స్వెటర్, బ్రౌన్ ప్యాంట్స్, తెల్ల స్నీకర్స్ వేసుకొని స్టైలిష్గా కనిపిస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత కోహ్లీ తిరిగి భారత్ రాలేదు.
ఎటూ సెలవులే కాబట్టి అక్కడి నుంచి ఆమ్స్టర్డ్యాం వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ లండన్ చేరుకున్నాడు. తనకు రోడ్డుపై నడుస్తూ ఉండటం చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు. కానీ చాలాకాలంగా భారత్లో తను నడవలేకపోయానన్నాడు. ప్రపంచంలోని అత్యంత పాపులర్ క్రీడాకారుల్లో ఒకడైన కోహ్లీ.. ఇండియాలో రోడ్డుపై నడుస్తూ కనిపిస్తే ఫ్యాన్స్ను ఆపగలమా? అందుకే ఇలా లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించాడీ స్టార్.