కెరీర్ ఆరంభంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా బొద్దుగా ఉండేవాడని, కానీ ఆ తర్వాత తన అకుంఠిత పట్టుదలతో సూపర్ ఫిట్గా మారాడని పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చెప్పాడు. తనకు కోహ్లీపై చాలా గౌరవం ఉందని, అలాగే కోహ్లీ కూడా తనను గౌరవించేవాడని షెహజాద్ గుర్తుచేసుకున్నాడు. పాక్ జట్టులో రాజకీయాల వల్ల తను స్థానం కోల్పోయినట్లు ఇంతకుముందు పలుమార్లు అతను వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన షెహజాద్.. తనకు సాయం కావలసి వచ్చి, కోహ్లీని అడిగినప్పుడల్లా సాయం చేసేవాడని గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు, కోహ్లీ బెస్ట్ ఇంకా రాలేదని, అది త్వరలోనే బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు. 'మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. క్రికెట్ గురించి నాకు ఎప్పుడు సలహాలు, సూచనలు కావాలన్నా.. కోహ్లీ నాకు హెల్ప్ చేసేవాడు. ఒక ఆటగాడిగా నేను కోహ్లీని చాలా గౌరవిస్తా' అని చెప్పాడు.

'కోహ్లీ తనను తాను చాలా మార్చుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్లో కోహ్లీ ఆడినప్పుడు కొంచెం చబ్బీగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత తనను తాను కోహ్లీ అద్భుతంగా మలుచుకున్నాడు. కేవలం క్రికెట్లోనే కాదు మిగతా విషయాల్లో కూడా అతనిలో వచ్చిన మార్పులు చాలా గొప్పవి. టెస్టు క్రికెట్లో భారత్ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు' అని షెహజాద్ అన్నాడు.

కోహ్లీ అంత వేగంగా పరిస్థితులను అర్థం చేసుకొనే ఆటగాడిని తాను ఇప్పటి వరకు చూడలేదని షెహజాద్ చెప్పాడు. అదే సమయంలో కోహ్లీలో బెస్ట్ ఇంకా కనిపించలేదనే తాను ఫీల్ అవుతున్నానని, అది కూడా త్వరలోనే చూస్తామని అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఓటమి తర్వాత వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ మళ్లీ మైదానంలో దిగనున్నాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్కు అతను కీలకంగా మారనున్నాడు.