కుంబ్లే, కోహ్లీల మధ్య రాజీకి యత్నించిన సీఏసీ
కుంబ్లే, కోహ్లీల మధ్య రాజీ కుదిర్చేందుకు బీసీసీఐతోపాటు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ కూడా ప్రయత్నించినప్పటికీ.. వారి ప్రయత్నాలేవీ ఫలితం ఇవ్వలేదు. దీంతో కోచ్ పదవికి కుంబ్లే మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామాను బోర్డు కూడా ధ్రువీకరించింది.
టీమిండియాను టెస్టుల్లో నెంబర్ వన్గా నిలిపిన కుంబ్లే
'కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు ధ్రువీకరిస్తున్నాం. కోచ్గా కొనసాగాలని క్రికెట్ సలహా కమిటీ కోరినప్పటికీ కుంబ్లే అంగీకరించలేదు. భారత జట్టు మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కుంబ్లేకు అభినందనలు. భారత క్రికెట్కు అతడు అందించిన సేవలు అమోఘం. భవిష్యత్తులో కుంబ్లేకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
కుంబ్లేని అవమానకర రీతిలో సాగనంపడంపై గవాస్కర్
కాగా, కుంబ్లేని అవమానకర రీతిలో సాగనంపడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్తో పాటు టీమిండియా మాజీ కోచ్ మదన్ లాల్ సైతం తప్పుబట్టారు. అసలు భారత క్రికెటర్లకు ఎటువంటి కోచ్ కావాలంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. కోచ్ను కాదు.. అతన్ని వ్యతిరేకించే ప్లేయర్స్ను టీమ్ నుంచి సాగనంపాలని గవాస్కర్ స్పష్టంచేశాడు.
షాపింగ్కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో
'మన ఆటగాళ్లను చూస్తుంటే మెతకగా ఉండే కోచ్ను కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి' అని గవాస్కర్ మండిపడ్డాడు.
కోహ్లీకి బీసీసీఐ సుతి మెత్తని వార్నింగ్
కుంబ్లేకి మద్దుతుగా, కోహ్లీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీసీసీఐ నష్ట నివారణ చర్యలకు దిగింది. ‘నీకు నచ్చని కోచ్ ఇక కొనసాగడం లేదు. జట్టును నంబర్ వన్గా నిలిపిన కోచ్ను వదులుకుంటున్నాం. కాబట్టి.. ఈ ప్రభావం జట్టుపై ఉండొద్దు. ప్రదర్శనలో తేడా రావొద్దు. ఈ నిర్ణయానికి నువ్వు న్యాయం చేకూర్చాలి' అంటూ బీసీసీఐ కెప్టెన్ కోహ్లికి సుతి మెత్తగానే వార్నింగ్ ఇచ్చింది.