Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాతో తన రూ.110 కోట్ల ఒప్పందాన్ని ముగించాడు. విరాట్ కోహ్లీ పూమా బ్రాండ్తో ఎనిమిదేళ్ల అనుబంధం కలిగి ఉన్నాడు. పూమా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విరాట్ కోహ్లీ.. రూ.110 కోట్ల విలువైన ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ డీల్ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. విరాట్ కోహ్లీ ఇప్పుడు బిజినెస్ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తన సొంత బ్రాండ్ అయిన వన్8 కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. స్పోర్ట్స్వేర్, ఫుట్ వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వన్ 8ను మరింత విస్తరించేందుకు విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
విరాట్ కోహ్లీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. విరాట్ కోహ్లీ క్రీడా అథ్లెటర్ కంపెనీ అజిలిటాస్ లో పెట్టుబడిదారుడిగా చేరనున్నట్లు తెలుస్తోంది. అజిలిటాస్ కంపెనీని అభిషేక్ గంగూలీ 2023 సంవత్సరంలో ప్రారంభించారు. అభిషేక్ గతంలో కోహ్లీని పూమాతో పని చేసేలా ఒప్పించాడు. 2017 సంవత్సరం నుంచి కోహ్లీ పూమాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. విరాట్ కోహ్లీకి సొంత బ్రాండ్ వన్8 ఉంది. దీనిని విరాట్ కోహ్లీ 2017 సంవత్సరంలో ప్రారంభించారు. విరాట్ కోహ్లీ ఇప్పుడు తన వన్8 బ్రాండ్ ను అజిలిటాస్ ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అజిలిటాస్ అభివృద్ధిలో వన్8 కీలక భాగస్వామిగా మారుతుంది.

పూమా ప్రతినిధి కూడా విరాట్ కోహ్లీ డీల్ ముగిసిన విషయాన్ని ధ్రువీకరించారు. పూమా ప్రతినిధి మాట్లాడుతూ.. "క్రికెటర్, బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీతో తన దీర్ఘకాల భాగస్వామ్యం ముగింపును స్పోర్ట్స్ బ్రాండ్ పూమా ఇండియా ధ్రువీకరిస్తోంది. పూమా విరాట్ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. చాలా సంవత్సరాలుగా కోహ్లీతో అద్భుతమైన అనుబంధం ఉంది. " అని అన్నారు. అంటే దీని అర్థం పూమా కోహ్లీ భవిష్యత్ కు శుభాకాంక్షలు తెలిపింది. కోహ్లీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మింట్ నివేదించింది.