హైదరాబాద్: ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరిస్ను 4-0తో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో తిరిగి వన్డే సిరిస్ జనవరి 15న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత లభించిన విరామాన్ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు.

తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి క్రిస్టమస్, నూతన సంవత్సవేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రకు బయల్దేరి వెళ్లారు. ఆదివారం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జోలీ గ్రాంట్ విమానాశ్రయంలో జంటగా ప్రత్యక్షమైన కోహ్లీ, అనుష్క ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.
ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు. వన్డే సిరీస్కు ఇంకా ఇరవైరోజుల గడువు ఉండడంతో ప్రస్తుతం అనుష్క శర్మతో కలిసి కోహ్లీ విహార యాత్రలో మునిగితేలుతున్నాడు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో తమ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా కోహ్లీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేకపోయాడు. ఉత్తరాఖండ్ చేరిన కోహ్లీ, అనుష్క శర్మ జంటకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ట్విట్టర్లో స్వాగతం పలికారు.
కోహ్లీ, అనుష్కకు స్వాగతం. ఈ సందర్శన మీకు మధురజ్ఞాపకంగా మిగిలిపోవాలని అభిలషిస్తున్నాను అని హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.
భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉన్న కోహ్లీ ఫ్యాషన్స్ని అనుకరించడంలో దిట్ట అని అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్ స్ధానంలో నడిపిస్తున్నాడు. ఇక అనుష్క సైతం నిన్నటి వరకు సినిమా షుటింగ్లతో అనుష్క బిజీబిజీగా గడిపారు.