

హైదరాబాద్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళలకు ఓ ప్రత్యేకమైన మెసేజ్ను ఇస్తూ ట్విట్టర్లో ఓ వీడియోని పోస్టు చేశాడు.
"మహిళా దినోత్సవం రోజునే మహిళా దినోత్సవాన్ని నిర్వహించి చేతులు దులిపేసుకోకుండా సంవత్సరంలోని మిగతా అన్ని రోజుల్లోనూ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి" అంటూ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని అన్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్ ఆడుతుంది. ఈ సిరిస్లో భాగంగా గత మంగళవారం నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40వ సెంచరీ. ఈ సెంచరీతో సచిన్ టెండుల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు సచిన్ 49 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించడానికి ఇంకా 9 సెంచరీల దూరంలో ఉన్నాడు. కాగా, ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం జరగనుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించడంతో ఈ సిరిస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.