హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్లే ప్రధాన కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడని పలువురు మాజీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఈ వివాదంలో కోహ్లీని అనవసరంగా నిందిస్తున్నారని ఠాకూర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ-కుంబ్లే మధ్య చోటు చేసుకున్న విభేదాలకు బీసీసీఐ పాలకవర్గం బాధ్యత వహించాలని అన్నాడు. 'అకారణంగా లక్ష్యం చేసుకున్నారు. దీనిని ఇంతటితో ఆపండి. మరో పదేళ్లలో భారత క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగల సామర్థ్యం కోహ్లీకి ఉంది. ఓ క్రికెటర్ను లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కెప్టెన్లు, మాజీ కెప్టెన్లను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలున్నాయి' అని అన్నాడు.

తమ హయాంలో ఉన్న పాలకవర్గమైతే ఇలాంటి పరిస్థితులు(కోచ్, కెప్టెన్ వివాదం)ను వివాదరహితంగా పరిష్కరించి ఉండేదని చెప్పారు. తాము ఉన్నపుడు క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. కుంబ్లేకు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి ఏవైనా సమస్యలు ఉంటే కొత్త కోచ్ను నియమించేందుకు కావాల్సిన వెసులుబాటును బోర్డుకు కల్పించామని అన్నాడు.
కుంబ్లే కోచ్ అయిన ఏడు, ఎనిమిది నెలల వరకు తామే బోర్డులో ఉన్నామని, ఆ సమయంలో ఈ విభేదాల గురించి అసలు ఒక్క వార్త కూడా రాలేదని, ఇప్పుడు అతను రాజీనామా చేస్తే అందరూ మాట్లాడుతున్నారని ఠాకూర్ విమర్శించాడు. ఈ వివాదంపై ప్రస్తుత బోర్డు సభ్యులు స్పందించాలని అన్నాడు.
అంతేకాదు తమ హయాంలో ఉన్నప్పుడు జట్టుకు సంబంధించిన విషయాలేవీ బహిర్గతం కాలేదనీ, ఇప్పుడు మాత్రం లీకులు చేస్తున్నారని ఠాకూర్ ఆరోపించాడు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఠాకూర్ తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. లోక్సభ ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్, ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ ఒలింపిక్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు.