ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ నిఘా ఉంచినట్టు వచ్చిన వార్తలు నిజమేనని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా ప్రకటించారు. విరాట్ కోహ్లీ ప్రవర్తనను పరిశీలిస్తున్నామని హిందూస్థాన్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పేర్కొన్నారు.
'సరే, అతని (విరాట్ కోహ్లీ ప్రవర్తన) పరిశీలనలో ఉంటుంది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా తీసుకుంటాం' అని దాల్మియా అన్నారు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ అటు మైదానంలో, ఇటు మైదానం బయట దరుసుగా ప్రవర్తించిన కొన్ని సందర్భాలు మనం చూశాం.
కోహ్లీ వైఖరిని దృష్టిలో పెట్టుకొని అతని టెస్టు కెప్టెన్సీపై ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అని నిర్ణయించే ముందు తాను కూడా అతడి ప్రవర్తనను పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ఎందుకంటే ఇదంతా తేలికగా మాట్లాడిన విషయం కాదన్నారు. ఇటీవల ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్లో పెర్త్ మ్యాచ్కి ముందు ఓ ఇంగ్లీష్ డైలీ జర్నలిస్ట్ని విరాట్ కోహ్లీ దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మల ప్రేమాయణం గురించి ఆ జర్నిలిస్ట్ రాసిన కథనమే అందుకు కారణం.

ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని డ్రెస్సింగ్రూమ్ కు వెళ్తున్న కోహ్లీకి భారత జర్నలిస్టుల బృందం ఎదురైంది. వెంటనే కోహ్లీ ఆ బృందంలోని ఓ జర్నలిస్టును అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అయితే తనను కోహ్లీ ఎందుకు తిడుతున్నాడో సదరు జర్నలిస్టుకు అర్థంకాలేదు. అక్కడే సహచర భారత ఆటగాళ్లకు సైతం ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు.
అయితే వెంటనే కోపాన్ని తగ్గించుకున్న కోహ్లీ అసలు మా ఇద్దరి(అనుష్క శర్మ) గురించి జాతీయ దినపత్రికలో రాసిన జర్నలిస్టు మీ బృందంలో ఉన్నాడని అనుకున్నా, అందుకే అలా మాట్లాడానన్నాడని చెప్పాడు. అనంతరం ఆ జర్నలిస్టుకు కోహ్లీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇలా కోహ్లీ - అనుష్కల ప్రేమాయణంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా కోహ్లీ స్లెడ్జింగ్కు పాల్పడుతున్నాడంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై నిఘా ఉంచింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.