
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ యోగి తరహాలో చొక్కా లేకుండా కేవలం షార్ట్స్పై కూర్చొని ఉన్నాడు. ఈ ఫోటోని తన ట్విట్టర్లో పోస్టు చేసిన కోహ్లీ "మనం అంతర్గత మనసు గురించి తెలుసుకున్నన్నాళ్లు బయట దేనినీ వెతకాల్సిన అవసరం లేదు" అని ట్వీట్ చేశాడు.
ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. "కోహ్లీ.. ట్రాఫిక్ పోలీసులు ఎంత చలానా వేశారేంటి?" అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ "విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎంత చలానా చెల్లించాడో" అని ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వ్యక్తికి రూ.23,000 చలాన్ వేసిన సంగతి తెలిసిందే.
దీంతో "ఇది బట్టలు వేసుకొని మరీ చెప్పొచ్చు భాయ్... ఏం చెప్పదల్చుకున్నారు" అని మరొక నెటిజన్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవలే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా టీ20 సిరిస్ను 3-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరిస్ను 2-0తో టెస్టు సిరిస్ను 2-0తో సొంతం చేసుకుంది.