హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి అడుగు దూరంలో ఉన్నాడు. దంబుల్లా వేదికగా ఆదివారం ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో పాటు కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ని 9 వికెట్ల తేడాతో గెలిపించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్కి 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 28.5 ఓవర్లలోనే టీమిండియా అలవోకగా చేధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ క్రమంలో ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు వన్డేల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ 16 మ్యాచ్ల్లో మొత్తం 814 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 14 మ్యాచ్ల్లో 785 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో 14వ వన్డే(ఒక క్యాలెండర్ ఇయర్)ని పూర్తి చేసుకున్న కోహ్లీ 769 పరుగులతో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ పరుగులు సాధించే క్రమంలో కోహ్లీ యావరేజి 96.1గా ఉండగా, జో రూట్ 71.3, డుప్లెసిస్ 58.1తో ఉన్నారు.
మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న సిరిస్లో ఇంకా నాలుగు వన్డేలు మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లీ మరో 45 పరుగులు చేస్తే ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన రికార్డుని సాధిస్తాడు. చివరి ఏడు ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 726 పరుగులు చేయడం విశేషం.
ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 24 (గురువారం) జరగనుంది.