
హైదరాబాద్: 2019 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 సెలబ్రిటీల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది రూ.252.72 కోట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
గత ఎనిమిదేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటిస్తోన్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకుంటూనే ఉన్నాడు. 31 ఏళ్ల విరాట్ కోహ్లీ అక్టోబర్ 1, 2018 నుంచి సెప్టెంబర్ 30, 2019 మధ్య కాలంలో సంపాదించిన మొత్తం విలువ రూ. 252.72 కోట్లు.
మ్యాచ్ ఫీజు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, స్పాన్సర్ చేసిన ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు ఫీజులు ఈ మొత్తంలో ఉన్నాయి. ఇక, 2018లో అగ్రస్థానంలో నిలిచిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి మూడో స్థానంలో నిలిచాడు. 2016 నుంచి అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ సంపాదన ఈ ఏడాది రూ. 229.25 కోట్లుగా ఉంది.
గతేడాది మూడో ర్యాంకులో నిలిచిన అక్షయ్ కుమారు ఈ ఏడాది రూ. 293.25 కోట్లతో టాప్ సెలబ్రిటీల జాబితాలో సల్మాన్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు. నాలుగో స్ధానంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(రూ. 239.25 కోట్లు) ఉండగా... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(రూ.135.93 కోట్లు)తో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో తొలిసారి టాప్-10లో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. దీపికా పదుకొణే(రూ.48 కోట్లు)తో పదో స్థానంలో నిలవగా... అలియా భట్(రూ. 59.21 కోట్లు)తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. షారుక్
ఖాన్(రూ.124.38 కోట్లు)తో ఆరో స్థానంలో నిలవగా... రణవీర్ సింగ్(రూ. 118.2 కోట్లు)తో ఏడో స్థానంలో నిలిచాడు.
2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ సత్తా ఇంకా తగ్గలేదు. రూ. 76.96 కోట్లతో సచిన్ తొమ్మిది స్థానంలో నిలిచాడు.
2019లో ఫోర్బ్స్ టాప్-100 సెలబ్రిటీల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్న వారు:
1. విరాట్ కోహ్లీ - రూ.252.72 కోట్లు
2. అక్షయ్ కుమార్ - రూ. 293.25 కోట్లు
3. సల్మాన్ ఖాన్ - రూ. 229.25 కోట్లు
4. అమితాబ్ బచ్చన్ - రూ. 239.25 కోట్లు
5. మహేంద్ర సింగ్ ధోని - రూ.135.93 కోట్లు
6. షారుక్ ఖాన్ - రూ.124.38 కోట్లు
7. రణవీర్ సింగ్ - రూ. 118.2 కోట్లు
8. అలియా భట్ - రూ. 59.21 కోట్లు
9. సచిన్ టెండూల్కర్ - రూ. 76.96 కోట్లు
10. దీపికా పదుకొణె - రూ.48 కోట్లు