
ముంబై: టీమిండియా మాజీ కేప్టెన్, బ్యాటింగ్ బ్యాక్బోన్ విరాట్ కోహ్లీ త్వరలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతోన్నాడు. ప్రస్తుతం అతను జట్టుతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటోన్నాడు. ఆసియా కప్ 2022లో ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే తన బిజినెస్ విస్తరణ పనుల్లో నిమగ్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ కేరీర్ కొనసాగిస్తూనే- తన వ్యాపార లావాదేవీలపైనా దృష్టి సారించనున్నాడు కింగ్ కోహ్లీ.
కోహ్లీ ఇదివరకే రెస్టారెంట్ బిజినెస్లో అడుగు పెట్టాడు. వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ తెరిచాడు. కోహ్లీ జెర్సీ నంబర్.. 18. అందుకే వన్8 అని పేరు పెట్టుకున్నాడు. కోల్కతలో తొలి రెస్టారెంట్ను నెలకొల్పాడు. ఆ తరువాత ఢిల్లీ, పుణేల్లో వాటిని విస్తరించాడు. కొత్తగా ముంబైలో రెస్టారెంట్ తెరవనున్నాడు. బాలీవుడ్ లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ కిశోర్ కుమార్ బంగళాలో రెస్టారెంట్ను నెలకొల్పనున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
లీజ్ అగ్రిమెంట్స్ వ్యవహారాలు కూడా దాదాపుగా ముగిశాయి. గౌరీ కుంజ్ పేరుతో ముంబైలోని జుహులో ఉంటుందీ బంగళా. ఇందులో రెస్టారెంట్ను నెలకొల్పనున్నాడు. ఈ బంగళాలో కొంతభాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. అయిదు సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కిశోర్ కుమార్ కొడుకు అమిత్ కుమార్ తెలిపారు. అగ్రిమెంట్స్ పేపర్ల మీద సంతకాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్కు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. చిన్న చిన్న మార్పులు చేస్తోన్నారు.
అక్టోబర్లో రెస్టారెంట్ ఓపెన్ అవుతుందని చెబుతున్నారు. వన్8 కమ్యూన్ పేరుతో విరాట్ కోహ్లీ నెలకొల్పబోతోన్న నాలుగో రెస్టారెంట్ ఇది. ప్రస్తుతం కోల్కత, ఢిల్లీ, పుణేల్లో ఒక్కొక్కటి చొప్పున ఇదివరకే అందుబాటులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని వన్9 కమ్యూన్ తన సోషల్ మీడియా అకౌంట్స్లల్లో పోస్ట్ చేసింది. తమ తదుపరి డెస్టినేషన్ ముంబై అంటే పేర్కొంది. జుహులో కొత్త రెస్టారెంట్ రాబోతోందని తెలిపింది.