
తొలి రెండు టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్..
ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్ అక్కడకు వెళ్లింది. తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఘోరంగా ఓడింది. ఈ మ్యాచుల్లో కోహ్లీ కూడా చాలా పేలవంగా ఆడాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 11 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. రెండో టెస్టులో 23, 9 స్కోర్లు నమోదు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టెస్ట్ పిచ్ అని చెప్పుకునే పెర్త్లో మూడో టెస్టు జరగనుంది. ఇక ఆ మ్యాచ్లో కనుక ఆడకపోతే తనను ఇంటికి పంపిచేస్తారని, మళ్లీ దేశవాళీలు ఆడి జట్టులోకి రావలసిందేనని కోహ్లీకి అర్థమైంది. ఇదే విషయాన్ని అతను చెప్పాడు.

మళ్లీ ఛాన్స్ రాదు అనుకున్నా..
'ఆస్ట్రేలియాలో మొదటి రెండు టెస్టుల్లో చాలా దారుణంగా ఫెయిలయ్యా. ఆ విషయం నాక్కూడా తెలుసు. తర్వాతి టెస్ట్ పెర్త్లో. ఆ పిచ్పై పేస్, బౌన్స్ భయంకరంగా దొరుకుతోంది. కానీ ఇక్కడ కూడా ఆడకపోతే నాకు అవకాశాలు ఉండవని కూడా నాకు అర్థమైంది. మళ్లీ తిరిగి వెళ్లిపోయి ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి తిరిగి జట్టులో స్థానం పొందాల్సి వస్తుంది' అని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచులు ఓడటంతో జట్టులో కూడా అంత ఉత్సాహం లేదని చెప్పాడు. సీనియర్ ప్లేయర్లు అంత ఒత్తిడిలో ఉండటం చూసి, తను బాగా ఆడగలననే నమ్మకం కూడా పోయిందన్నాడు.

నేనేం ఆడతాను? నా వల్లేం కాదు!
'ఆస్ట్రేలియాలో రెండు టెస్టులు ఘోరంగా ఓడితే మొత్తం వాతావరణం మారిపోతుంది. జట్టులో అందరూ చాలా ఒత్తిడిలో మునిగిపోయారు. టెన్షన్ పడిపోతుంన్నారు. మనం మొదటి సారి ఆస్ట్రేలియా వచ్చినప్పుడే అందరూ అలా ఉండటం చూసి.. ఇక నేనేం ఆడతాను అనిపించింది. ఇంత సీనియర్లే ఇలా ఉంటే నాకు అనుభవమే లేదు, నేనేం చేస్తాను? అనుకున్నా. కానీ ఆ సమయంలోనే నేను విభిన్నంగా ఆలోచిస్తే ఏదైనా చెయ్యగలను అనిపించింది' అని కోహ్లీ చెప్పాడు. ఆ సిరీస్ మూడో టెస్టు కోసం ఎదురు చూస్తూ.. ఎక్కడకు వెళ్లినా 'నేను చెయ్యగలను. వన్డేల్లో 8 సెంచరీలు చేశానంటే ఇక్కడ కూడా సాధించగలను. నా వల్ల అవుతుంది' అని తనకు తానే మోటివేట్ చేసుకున్నాడట.

ఓడినా హీరో అయ్యాడు..
ఆ తర్వాతి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ మ్యాచ్ భారత్ ఓడినా కూడా క్రికెటర్లంతా కోహ్లీ పట్టుదల, ఆటతీరును మెచ్చుకున్నారు. 'ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 48, రెండో ఇన్నింగ్స్లో 75 రన్స్ చేశా. అంత కఠిన పరిస్థితుల్లో జట్టు టాప్ స్కోరర్గా నిలవడంతో మనల్ని మనం నమ్మితే ఎంత శక్తి వస్తుందో అర్థమైంది' అని కోహ్లీ తెలిపాడు. అదే ఫామ్ కొనసాగించిన కోహ్లీ.. ఆ సిరీస్ చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే 116 చేశాడు. అదే కోహ్లీకి టెస్టుల్లో తొలి సెంచరీ కావడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.


Click it and Unblock the Notifications
