పేలవ ఫీల్డింగ్లో నంబర్ వన్ జట్టు ఏదంటో అందరికీ వెంటనే గుర్తొచ్చేది పాకిస్థాన్. సులువైన క్యాచ్లను జారవిడుస్తూ పాక్ ప్లేయర్లు మీమ్స్కు మంచి స్టఫ్ అందిస్తుంటారు. అంతేగాక పసికూన చేతుల్లో విఫలమవుతూ విమర్శలు పాలవుతుంటారు. అయితే ఇవన్నీ పాకిస్థాన్ను హేళన చేయడానికే! అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికొస్తే పాకిస్థాన్ జట్టు అత్యంత పవర్ ఫుల్.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలకడగా రాణిస్తున్న జట్టుగా పాకిస్థాన్ పేరిట మంచి రికార్డు ఉంది. 2009లో విజేతగా నిలిచిన పాక్ ఏకంగా ఆరు సార్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. 2007, 2009, 2010, 2012, 2021, 2022లో ఆ జట్టు సెమీస్లో అడుగుపెట్టింది. అయితే పొట్టి కప్లో దుర్బేధ్యంగా కనిపించే పాకిస్థాన్కు భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అంటే వెన్నులో వణుకు పుడుతుంటుంది.

సాధారణంగా ఐసీసీ మెగా టోర్నీలంటే రెచ్చిపోయే కోహ్లి.. పాకిస్థాన్తో మ్యాచ్ అంటే పగతో, కసితో ఆడుతున్నట్లుగా చెలరేగుతుంటాడు. కనికరంగా లేకుండా పాక్ బౌలర్లను తునాతునకలు చేస్తుంటాడు. టీ20 ప్రపంచకప్లో మరే ఆటగాడు అందుకోని రీతిలో పాకిస్థాన్పై రికార్డు సగటును కోహ్లి కలిగి ఉన్నాడు. పొట్టి కప్లో చిరకాల ప్రత్యర్థిపై 308 పరుగులు చేశాడు. ప్రపంచకప్లో పాకిస్థాన్పై 300+ సగటు కలిగి ఉన్న ఏకైక బ్యాటర్ కోహ్లినే.
టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్పై కోహ్లి నాలుగు 50+ స్కోర్లు సాధించాడు. పాక్తో జరిగిన మ్యాచ్ల్లో 78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్, 57, 82 నాటౌట్తో పరుగులు చేశాడు. గత వరల్డ్ కప్లో మెల్బోర్న్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి అద్వితీయ పోరాటాన్ని క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.
కాగా, పొట్టి కప్లో పాకిస్థాన్పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి తర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ ఉన్నాడు.పాకిస్థాన్తో ఆరు మ్యాచ్లు ఆడిన షకిబ్ 44 సగటుతో 220 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. పాకిస్థాన్పై మైక్ హస్సీ 168 పరుగులు, షేన్ వాట్సన్ 153 పరుగులు చేశారు. కాగా, న్యూయార్క్ వేదికగా ఆదివారం భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి.