చెత్త రికార్డు:
పస లేని బ్యాటింగ్, బౌలింగ్తో రెండు టెస్టుల్లోనూ ఓడి 0-2తో సిరీస్ను చేజార్చుకున్న టీమిండియా 8 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్వాష్ అయింది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0-4లో వైట్వాష్ అయిన టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్లకు కివీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది.
ఇదే మొదటిసారి:
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వైట్వాష్ అవడం ఇదే మొదటిసారి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి సారధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడింది లేదు. ఇక 2018 నుంచి విదేశాల్లో ఆడిన నాలుగు సిరీస్లలో మూడింటిలో కోహ్లీసేన ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా వైట్వాష్ అయింది.
ఆరంభంలో ఆకట్టుకుంది:
జనవరి చివరలో కివీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ ఆరంభంలో ఆకట్టుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత మాత్రం చతికిల పడింది. వన్డే, టెస్టు సిరీస్లను కివీస్కు సమర్పించుకుంది. వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయిన టీమిండియా.. తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో, రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
టాప్లోనే భారత్:
తాజా కివీస్ పర్యటనలోని రెండు టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడినా కూడా పాయింట్ల పట్టికలో భారత్ తన నెం.1 స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 296 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. అయితే ఆస్ట్రేలియాకు భారత్కు మధ్య 64 పాయింట్ల భారీ తేడా ఉండటం విశేషం. న్యూజిలాండ్ రెండు టెస్టులను గెలుపొందడంతో.. ఏకంగా 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో 180 పాయింట్లతో ఇంగ్లాండ్ను వెనక్కినెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించింది.