న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాకీయ క్రికెట్ కౌన్సెల్ (ఐసీసీ) పైన బుధవారం నాడు మండిపడ్డారు. నాగపూర్ పిచ్ దారుణంగా ఉందని రేటింగ్ ఇవ్వడం పైన కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాగపూర్ పిచ్ పూర్ అని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
దక్షిణాప్రికాలోను ఇలాంటి పిచ్లు ఉన్నాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాగపూర్ పిచ్ బాగా లేదని చెప్పడం కొందరి అభిప్రాయం అన్నాడు. కొందరు నాగపూర్ పిచ్ బాగా లేదని పేర్కొనడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ పిచ్కు పూర్ రేటింగ్ ఇవ్వడంపై మాట్లాడుతున్నారా అని పాత్రికేయులు ప్రశ్నించగా... అందరి గురించి చెబుతున్నానని కోహ్లీ సమాధానం ఇచ్చాడు. నేను కేవలం పిచ్ బాగా లేదని రాసే వాళ్ల గురించి మాత్రమే చెప్పడం లేదన్నాడు.
ఇక్కడ ఏ చిన్న విషయం పైన అయినా హైలెట్ చేస్తారన్నాడు. మేం దక్షిణాప్రికాలో బాగా ఆడకుంటే... దానినే హైలెట్ చేస్తారన్నాడు. ఇక్కడ విదేశీ జట్లు ఆడితే వికెట్ తప్పు అని చెప్పడం సరికాదన్నాడు. పిచ్ గురించి మాట్లాడటం కాదని, ప్రతి విషయంపై పాటిజివ్గా ఉండాలన్నాడు.
జట్టు గెలిస్తే అందరి సహకారం అవసరమన్నాడు. ప్రతి ఒక్కరు పిచ్ పైన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబీ బంతితో అడిలైడ్లో ఆడిన టెస్ట్ కూడా రెండున్నర రోజుల్లో ముగిసిందని, దాని గురించి ఎవరైనా రాశారా అని నిలదీశాడు. కాబట్టి మన పిచ్లలో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తున్నానని చెప్పాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది. నాగపూర్ టెస్టులో 124 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. నాగపూర్ టెస్ట్.. సరిగా కేవలం రెండున్నర రోజులు కూడా ఆడలేదు.
మూడో టెస్టుకు వేదికైన నాగ్పూర్ పిచ్ పేలవమని ఐసీసీ రిఫరీ అభిప్రాయపడ్డాడు. పిచ్ తీరుపై మ్యాచ్ అధికారుల ఆందోళనను తెలుపుతూ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ మేరకు ఐసీసీకి ఒక నివేదికను కూడా సమర్పించాడు. ఈ నివేదికను ఐసీసీ... బీసీసీఐకి పంపింది.
బోర్డు దీనికి పద్నాలుగు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నాగ్పూర్లో విదర్భ క్రికెట్ సంఘం మైదానం పిచ్ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు సహకరించిన విషయం తెలిసిందే. బీసీసీఐ తన స్పందనను తెలిపాక ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్, ఐసీసీ ప్రధాన రిఫరీ రంజన్ మదుగలెలు మ్యాచ్ వీడియో ఫుటేజ్ సహా అన్ని సాక్ష్యాలను పరిశీలిస్తారు.
ఆ తర్వాత పిచ్ పేలవంగా ఉందా లేదా, ఉంటే జరిమానా విధించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. వారు ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఈ అంశంపై ఐసీసీ తదుపరి వ్యాఖ్యలు చేయవద్దు. స్పిన్కు విపరీతంగా సహకరించిన నాగ్పూర్ పిచ్పై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు కూడా.
నాగ్పూర్ పిచ్ను చెత్త పిచ్గా పేర్కొన్న ఐసీసీ రూ.10 లక్షల జరిమానా కూడా విధించే అవకాశముంది. ఐసీసీ తొలిసారి పేలవ పిచ్గా గుర్తిస్తే తీరు మార్చుకోవాలని మ్యాచ్ ఆతిథ్య సంఘాన్ని హెచ్చరిస్తుంది. లేదంటే రూ.పది లక్షల జరిమానా విధిస్తుంది.