
నడవలేకున్నా..వీల్ ఛైర్లో!
పొడుగు చేతుల స్వెట్టర్, మెడలో స్కార్ఫ్లా ధరించిన దుపట్టా, చెంపలపై త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసుకుని కనిపించిన ఆ వృద్ధురాలి పేరు చారులతా పటేల్. వయస్సు 87 సంవత్సరాలు. అయినప్పటికీ- యంగ్ జనరేషన్కు తీసిపోని విధంగా సందడి చేశారామె. కెమెరా కళ్లను తన చుట్టూ తిప్పుకొన్నారు. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలిచారు. టీమిండియా బ్యాట్స్మెన్లు షాట్ కొట్టిన ప్రతీసారీ.. పొడుగాటి బూరను ఊదుతూ చిన్నపిల్లలా మారిపోయారు. నిజానికి ఆమె నడవలేరు. అయినప్పటికీ- మ్యాచ్ను చూడాలనే ఆశతో వీల్ ఛైర్లో స్టేడియానికి వచ్చారు.

ఆశీర్వాదాన్ని అందుకున్న విరాట్, రోహిత్!
ఆమె చేసిన సందడి కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కేప్టెన్, సెంచరీ హీరో రోహిత్ శర్మలను కూడా ఆకర్షించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరు నేరుగా- చారులతా పటేల్ వద్దకు వెళ్లారు. భక్తిభావంతో నమస్కరించారు. చారులత ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆమెతో ముచ్చట్లు పెట్టుకున్నారు. కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్బంగా చారులత ఆప్యాయంగా విరాట్ కోహ్లీని ముద్దాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దాన్ని షేర్ చేశారు.
1983 ప్రపంచకప్కు ప్రత్యక్షసాక్షి
చారులత పటేల్ దశాబ్దాల కిందటే క్రికెట్ అభిమానిగా మారిపోయారు. టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ను కూడా ఆమె వదులుకోలేదట. 1983లో కపిల్ దేవ్ కేప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ను ముద్దాడిన అపురూప సన్నివేశానికి కూడా చారులత ప్రత్యక్ష సాక్షి. ఆ మ్యాచ్ను కూడా తాను స్టేడియంలో కూర్చుని చూశానని ఆమె వెల్లడించారు. మ్యాచ్ అనంతరం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారామె. కపిల్ పాజీ నేతృత్వంలో టీమిండియా ప్రపంచకప్ గెలవడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని, ఈ సారి కూడా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని క్రికెట్ జట్టు కప్పు గెలుస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత జట్టు కప్పు గెలవాలని తాను గణేషుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

సెమీస్ చేరిన రెండో జట్టుగా..
ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్ను ఓడించడంతో టీమిండియాకు సెమీఫైనల్ ఎంట్రీ లభించింది. దర్జాగా సెమీస్లో అడుగు పెట్టింది. టీమిండియా ఈ టోర్నమెంట్లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ 5వ తేదీన శ్రీలంకను ఢీ కొట్టబోతోంది భారత క్రికెట్ జట్టు. భారత జట్టుకు ఈ టోర్నమెంట్లో అదే చివరి లీగ్ మ్యాచ్. బంగ్లాదేశ్ జట్టును 28 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. 92 బంతుల్లో 104 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు సాధించడానికి బాటలు వేశాడు. ఈ సెంచరీలో అయిదు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. సౌమ్యా సర్కార్ బౌలింగ్లో లిట్టన్ కుమార్ దాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్.


Click it and Unblock the Notifications












