
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో త్వరలో జరగనున్న సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్, భారత జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకొని.. అక్కడి లీలా ప్యాలేస్ హోటల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటున్నారు. క్వారంటైన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంది. దీంతో ఈ సమయాన్ని కోహ్లీ తన ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ తన రూమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోను తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కోహ్లీ.. ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతాన్ని (పంజాబీ సాంగ్) వింటూ వేగంగా సైక్లింగ్ చేస్తున్నాడు. 'క్వారంటైన్ రోజుల్లో మంచి సంగీతం, జిమ్ పరికరాలు అవసరం. అనుకుంటే.. ఉంటే ఎక్కడైనా మనకి కావాల్సింది చేయొచ్చు' అని వీడియోకి వ్యాఖ్య జత చేశాడు. పెటర్నిటీ సెలవులపై ఇండియాకు వచ్చాక కసరత్తులు చేసేందుకు కోహ్లీకి టైం దొరకలేదు. ఇంట్లో ఉన్నంతసేపు పాపతో బాగా టైం స్పెండ్ చేశాడు.
భారత క్రికెటర్లకు గురువారం తొలి రౌండ్ కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఫిబ్రవరి 2న సాధన ఆరంభించడానికి ముందు ఆటగాళ్లు మరో రెండు సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సివుంటుంది. భారత క్రికెటర్లంతా ఇప్పుడు లీలా ప్యాలేస్ హోటల్లో బయో బబుల్లో ఉన్నారు. అయితే క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.
తొలి టెస్టు తర్వాత పెటర్నటీ లీవ్పై విరాట్ కోహ్లీ భారత్కి వచ్చేయగా.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ టీమిండియాని కెప్టెన్గా అజింక్య రహానే సమర్థంగా నడిపించాడు. భారత్ 2-1తో సిరీస్ గెలిచింది. దాంతో టెస్టు కెప్టెన్సీ బాధ్యతల్ని రహానేకి అప్పగించి.. కోహ్లీ కెప్టెన్సీని వన్డే, టీ20లకే పరిమితం చేయాలనే డిమాండ్లు మాజీ క్రికెటర్ల నుంచి వినిపిస్తున్నాయి.