టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఇంగ్లాండ్ మాజీ స్టార్ పీటర్సన్ కు మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే చాలాసార్లు విరాట్ కోహ్లీపై పీటర్సన్ ప్రశంసలు కూడా కురిపించాడు. ఎన్నో సార్లు విరాట్ కు మద్దతుగా నిలిచాడు. అయితే గత కొద్ది రోజులుగా ఇంగ్లాండ్ సిరీస్ లో కోహ్లీ-పీటర్సన్ పేర్లు వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాయి. ఇద్దరు కలిసి సరదాగా ముచ్చటిస్తున్న వీడియోలు, ఆటపట్టించుకుంటున్న వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు పీటర్సన్. కోహ్లీ తన కుమారుడు డిలాన్ స్టార్ కు జెర్సీపై 'టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్' అని ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపాడు. అలాగే తన కొడుకు ఆ జెర్సీని ధరించిన ఫొటోను పోస్ట్ చేశాడు. 'ధన్యవాదాలు మిత్రమా..!' అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు పీటర్సన్. ఈ పోస్ట్ చూసిన క్రికెట్ అభిమానులు మీ ఇద్దరి మధ్య స్నేహబంధం ఇలాగే కొనసాగాలని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

కాగా, పీటరన్స్ ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ తరఫున ఆడాడు. ఆ సమయంలో కోహ్లీ - పీటర్సన్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఐపీఎల్ లో పీటర్సన్ 13 మ్యాచ్ లు ఆడి 32.90 సగటుతో, 135.95 స్ట్రైక్ రేట్ తో 329 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం అతడు కామెంటేటర్ గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ కామెంటేటర్ గా వ్యవహరించాడు. ఈ సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది.