ఈ ఏడాది తొలి డబుల్ వెస్టిండిస్పై
ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్తో కరేబియన్ దీవుల్లో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇండోర్లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 211 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు.
తొలి కెప్టెన్గా కోహ్లీ రికార్డు
ఇక తాజాగా ముంబైలో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఒక ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక కేలండర్ ఇయర్లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు.
రెండో భారత కెప్టెన్గా కోహ్లీ
1955లో వినోద్ మన్కడ్, 1992లో కాంబ్లి, 2003లో రాహుల్ ద్రవిడ్లు ఈ ఘనతను సాధించారు. మరోవైపు ఒక టెస్టు సిరిస్లో 500కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ గుర్తింపు పొందాడు. ఇక ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు.
సునీల్ గవాస్కర్ రికార్డు సమం
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్లో 96వ పరుగు చేసే క్రమంలో కోహ్లీ ఈ సిరిస్లో 500 పరుగుల మార్కుని అందుకున్నాడు. దీంతో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని సమం చేశాడు. ఒక సిరిస్లో 500కు పైగా పరుగులను గవాస్కర్ రెండు సార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు.
2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు
ఆ తర్వాత 1981-82 సీజన్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో 2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు సాధించినట్లైంది.
మూడో భారత కెప్టెన్గా కోహ్లీ
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లీ ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక కేలండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డుని టీమిండియా కెప్టెన్లుగా ఇద్దరు మాత్రమే సాధించారు. 1997లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్న కెప్టెన్లుగా ఉన్నారు.