టాప్-10లో జాబితాలో కోహ్లీ
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. బ్రియాన్ లారా తన కెరీర్లో 10,405 పరుగులు చేయగా... కోహ్లీ ఆ రికార్డు అధిగమించి 10,430 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 క్రికెటర్ల జాబితాలో అత్యధిక సగటు ఉన్న బ్యాట్స్మెన్ కూడా కోహ్లీనే. విరాట్ కోహ్లీ యావరేజి 59.84 కాగా... ఆ తర్వాతి స్థానంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 44.83 యావరేజితో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ మొత్తంగా 463 మ్యాచ్లు ఆడి, 44.83 సగటుతో 18426 పరుగులు చేసి వన్డే ఆల్ టైమ్ టాప్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే.
వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ధావన్
మరోవైపు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా ధావన్ నిలిచాడు. విరాట్ కోహ్లీ 114 మ్యాచ్ల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోగా, శిఖర్ ధావన్ 118 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
బ్రయాన్ లారాతో కలిసి నాలుగోస్థానంలో ధావన్
ఈ వన్డేకు ముందు పది పరుగుల దూరంలో ఉన్న శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో టిమ్ సౌథీ బౌలింగ్లో సింగిల్ తీసి ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న వారి జాబితాలో హషీం ఆమ్లా (101 మ్యాచ్లు), వివియన్ రిచర్డ్స్ (114), విరాట్ కోహ్లీ (114) తొలి మూడు స్థానాల్లో ఉండగా.. బ్రయాన్ లారా (118)తో కలిసి ధావన్ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.
వన్డేల్లో 100 వికెట్లు తీసిన షమీ
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ కూడా ఈ మ్యాచ్లో ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరపున అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. షమీ 56 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్(59), జహీర్ ఖాన్(65), అజిత్ అగార్కర్(67), జవగల్ శ్రీనాథ్(68) ఉన్నారు.