ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ రూల్పై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది బౌలర్ల పాలిట శాపంగా మారుతుందని అన్నాడు. ఈ నిబంధనతో ప్రతి బంతి బౌండరీకి వెళ్లేలా పరిస్థితి తయారైందని అన్నాడు. అలాగే ధోనీతో ఇవాళ తనకి చివరి మ్యాచ్ అవుతుందేమో అని పేర్కొన్నాడు. 'జియో సినిమా'తో ఆసక్తికర విషయాలను కోహ్లి పంచుకున్నాడు.
మ్యాచ్లో సందర్భాన్ని బట్టి ఓ ఆటగాడికి బదులుగా మరో ప్లేయర్ను జట్టులోకి తీసుకురావడమే ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్. టాస్ సమయంలో కెప్టెన్ తుది జట్టుతో పాటు అయిదుగురు పేర్లను సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా ప్రకటిస్తాడు. ఈ అయిదుగురులో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగవచ్చు. అయితే ఈ నిబంధనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఈ రూల్తో ఆల్రౌండర్లు వెలుగులోకి రాలేకపోతున్నారని, ఇది భారత క్రికెట్ భవిష్యత్కు ప్రమాదకరమని మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు పేర్కొన్నారు. అంతేగాక ఇది బౌలర్లకు తీవ్ర నష్టాన్ని గురిచేస్తుందని అన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో జట్టులో అదనపు బ్యాటర్ వస్తుండటంతో, మిగిలిన బ్యాటర్లు స్వేచ్ఛగా విధ్వంసం సృష్టిస్తున్నారు. అందుకే ఈ సీజన్లో భారీ స్కోరు నమోదవుతున్నాయని మాజీల వాదన. అలాగే అదనపు బౌలర్ను తీసుకోవడంతో ఆల్రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై తాజాగా విరాట్ కోహ్లి కూడా స్పందించాడు. ''ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి రోహిత్ శర్మ చెప్పిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. దాని వల్ల ప్రతి బంతి ఫోర్ లేదా సిక్సర్గా మారుతుందేమో అని బౌలర్లు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడని, పునఃసమీక్షిస్తామని వెల్లడించాడని తెలిసింది. ఏం జరుగుతుందో చూడాలి''
''ధోనీతో నేను మళ్లే ఆడే అవకాశం ఉండొచ్చు. లేదా ఇదే చివరి మ్యాచ్ కావొచ్చు. ఎవరికి తెలుసు? అయితే ఇది అభిమానులకు ఎంతో ఆస్వాదించే క్షణాలు. భారత్ తరఫున మహీతో కలిసి ఎన్నో ఏళ్లుగా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాను. అతను ఎన్నో మ్యాచ్లను గెలిపించాడని అందరికీ తెలుసు'' అని కోహ్లి అన్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.