ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ స్కోర్ ను అలవోకగా అందుకుంది. 81 బంతులు మిగిలి ఉండగానే దీన్ని ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లల్లో ఆరింట్లో నెగ్గింది ఆర్సీబీ. మొత్తం 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే టాప్ స్కోరర్. 33 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్వుడ్ (4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్ధర్ సలామ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ (15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) అజేయంగా నిలిచారు. జాకబ్ బెథెల్ 11 బంతుల్లో ఫోర్, రెండు సిక్స్లతో 20 పరుగులు చేశాడు.
తన బౌలింగ్ పట్ల భువనేశ్వర్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. జట్టులో విరాట్ కోహ్లీ అనుభవం, అతను ఇచ్చిన విలువైన సూచనలు తనకు పనికొచ్చాయని చెప్పాడు. కోహ్లీ కేప్టెన్ గా లేకపోయినా అతని సలహాలు జట్టు ప్లానింగ్ లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయని తెలిపాడు. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడి ఉనికి జట్టు వాతావరణం, మైదానంలో కీలక నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని, బ్యాటింగ్లో గానీ, బౌలింగ్ లో గానీ అతని సలహాలు ఎంతో సహాయపడతాయని, అంత అనుభవం ఉన్న ఓ ప్లేయర్ జట్టులో ఉండటం ఓ గొప్ప అసెట్ భువి వివరించాడు. తన దృక్పథంలో కూడా మార్పును తీసుకొచ్చిన వ్యక్తిగా కోహ్లీని అభివర్ణించాడు భువనేశ్వర్ కుమార్. వ్యక్తిగత ప్రదర్శనల గురించి తాను పెద్దగా ఆలోచించనని, అందరూ సమష్టిగా ఆడితేనే జట్టు గెలుస్తుందని చెప్పాడు.