2-1తేడాతో వన్డే సిరిస్ను చేజార్చుకున్న టీమిండియా
టీ20 సిరిస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో సిరిస్ను 2-1తేడాతో చేజార్చుకుంది. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
2016 తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి
అదేవిధంగా టీమిండియా 2016 తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి. మూడు వన్డేల సిరిస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డేలో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ గెలిచి వరుసగా పది వన్డే సిరీస్లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా సరసన నిలవాలనుకున్న భారత ఆశలు కూడా ఆవిరయ్యాయి.
తొలి వన్డేలో గెలిచిన టీమిండియా
మూడు వన్డేల సిరిస్లో భాగంగా జులై 12న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచి సిరిస్ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఆ తర్వాతి రెండు వన్డేల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడింది. చివరిసారిగా టీమిండియా 2016లో ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్లో ఓటమిపాలైంది.
ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్
2016లో జింబాబ్వేపై 3-0తో సిరీస్ గెలిచిన భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై ద్వైపాక్షిక సిరీస్లను సొంతం చేసుకుంది. ఇక, ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్ గడ్డపై భారత్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ కూడా గెలవక పోవడం విశేషం.