హైదరాబాద్: తనను 'పాము తలతో' పోల్చిన ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గట్టిగానే సమాధానమిచ్చాడు. బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీసి భారత్ పతనాన్ని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ శాసించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 12 పరుగులకే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిన కోహ్లీసేన 189 పరుగులకే ఆలౌటైంది.
ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం లియాన్ మాట్లాడుతూ టీమిండియా పాములాంటిదని అన్నాడు. కోహ్లీ అనే తలను తీసేస్తే టీమిండియా నిర్జీవమైపోతుందని లియాన్ అన్నాడు. అయితే బెంగుళూరు టెస్టు విజయానంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ లియాన్కు కౌంటర్ ఇచ్చాడు.

తలను తీసేసినా పాము బతికే ఎలా ఉండగలిగింది? అంటే టీమిండియా పాము కాదన్న విషయం అంతా గుర్తించాలని ఆస్ట్రేలియన్లకు పరోక్షంగా సూచించాడు. అంతేకాదు తామంతా జట్టుగా, సమష్టిగా గెలిచామని తెలిపాడు. ఓడిపోయినా సమష్టిగా ఓడిపోయామని కోహ్లీ చెప్పడం విశేషం.
ఇప్పటివరకు గెలిచిన టెస్టుల్లో ఇదే అత్యుత్తమ టెస్టు అని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ టెస్టులో మేము సమష్టిగా పోరాడి విజయం సాధించామని అన్నాడు. 'ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. మేమంతా ఒక జట్టు. సమిష్టిగా విజయాలు సాధిస్తాం. సమిష్టిగానే ఓడిపోతాం. బాయ్స్ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. జై హింద్' అని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.