
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజైన మంగళవారం 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు మూడు వికెట్లను చేజార్చుకుంది.
షమీ అద్భుతమైన బౌలింగ్తో సమరవిక్రమను పెవిలియన్ పంపగా జడేజా రెండు వికెట్లు తీశాడు. నాలుగో రోజు చివరి ఓవర్ వేసేందుకు కోహ్లీ జడేజా చేతికి బంతిని అప్పగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే కరుణరత్నేను జడేజా ఔట్ చేశాడు.
అనంతరం అదే ఓవర్ నాలుగో బంతికి నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగిన సురంగ లక్మల్ను ఔట్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన లక్మల్... రవీంద్ర జడేజా విసిరిన బంతిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. జడేజా విసిరిన బంతి బ్యాట్ను కిందకు వంచేలోపే బ్యాట్ అంచును తాకుతూ వికెట్లను గిరాటేసింది.
అయితే లక్మల్ బౌల్డ్ అయిన విషయాన్ని గమనించని జడేజా ఔట్ కోసం అంఫైర్కు అప్పీల్ చేశాడు. జడేజా అప్పీల్ చేయడాన్ని చూసిన జట్టులోని మిగతా ఆటగాళ్లు అతడిని చూసి నవ్వుకున్నారు. బౌల్డ్ అయితే అంఫైర్కు అప్పీల్ చేయడం ఏంటంటూ జడేజాను ఆటపట్టించారు.
టీవీలో ఈ వీడియోని చూసిన కామెంటేటర్లు కూడా రవీంద్ర జడేజా చేసిన పనిని చూసి నవ్వుకున్నారు. అయితే ఆ తర్వాత తాను అలా ఎందుకు చేశాననే విషయమై సహచర క్రికెటర్లకు రవీంద్ర జడేజా వివరణ ఇచ్చిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్వీట్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక ఐదో రోజు లంచ్ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 31/3తో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఐదోరోజైన బుధవారం నిలకడగా ఆడుతోంది.
ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా (72), దినేశ్ చండిమాల్ (27) పరుగులతో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు ఇప్పటికే 84 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ ఫామ్ను కొనసాగిస్తున్న చండీమాల్.. లంకను గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
జడేజా తప్ప మిగతా బౌలర్లెవరూ తొలి సెషన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా చేసిన పొరపాటు వల్ల టీమిండియా ఐదో వికెట్ తీయలేకపోయింది. ఇన్నింగ్స్ 43.4వ బంతికి దినేశ్ చండిమాల్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక రివ్యూని ఆశ్రయించింది.
అయితే రివ్యూలో అది నో బాల్గా తేలడంతో దినేశ్ చండిమాల్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అంతకు ముందు శ్రీలంక జట్టు స్కోరు 35 పరుగుల వద్ద మాథ్యూస్ (1) రహానేకు క్యాచ్ ఇచ్చాడు. ఇదీ కూడా నోబాలే కావడం విశేషం. అయితే అంపైర్ గమనించకపోవడం... మాథ్యూస్ రివ్యూని కోరకపోవడంతో పెవిలియన్ చేరుకున్నాడు.