హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినప్పటికీ, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత్ తరపున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్మన్గా కోహ్లీ నిలిచాడు. అంతకముందు భారత్ తరపున సచిన్, ద్రవిడ్, గంభీర్, గావస్కర్, సెహ్వాగ్, వెంగ్సర్కార్ ఈ ఘనతను అందుకున్నారు. ఆతిథ్య ఇంగ్లాండ్తో ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి 200 పరుగులు చేసిన కోహ్లీ ఐసీసీ ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో 934 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలిచాడు.
దీంతో గత 32 నెలలుగా నంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను వెనక్కినెట్టాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ కంటే కోహ్లీ 5 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకుని కోహ్లీ నిలబెట్టుకోవాలంటే ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ తన ఫామ్ని కొనసాగించాల్సి ఉంది.
2011 జూన్లో భారత్ తరుపున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ అయిన తర్వాత ఓ భారత బ్యాట్స్మన్ టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మరోవైపు కోహ్లీ కూడా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.
ఇక, కోహ్లీ వ్యక్తిగత విషయాలకు వస్తే భార్యను ఎంతగానో ప్రేమిస్తాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సహచరులందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై చేసిన సెంచరీ కావడంతో ప్రత్యేక సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ బంతిని పాయింట్ దిశగా బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి స్టేడియంలో ఉన్న అనుష్క శర్మ వైపు తిరిగి తన మెడలో ఉన్న రింగ్ను తీసి ముద్దాడాడు. బ్యాట్తో గాల్లోకి ముద్దులు విసిరి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సన్నివేశం భారత అభిమానులను సైతం ముగ్ధులను చేసింది. ఇదిలా ఉంటే, ఆగస్టు 5 (ఆదివారం) ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోని ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.