హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన కలిశారు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా గురువారం బెంగళూరులో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్, స్మృతి వచ్చారు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీని కలిశారు. ఈ సందర్భంగా కోహ్లీతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్లో హర్మన్, స్మృతిలు కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే బెంగళూరు వేదికగా భారత్తో జరిగిన నాలుగో వన్డేను ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.
భారత బ్యాట్స్మెన్లలో రహానే 53, రోహిత్ శర్మ 65, కోహ్లీ 21, పాండ్యా 41 పరుగులు చేయగా... జాదవ్ 67, పాండే 33, ధోనీ 13, షమీ 6, అక్షర్ పటేల్ 5, ఉమేశ్ యాదవ్ 2 పరుగులు చేశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే అక్టోబరు 1న నాగ్పూర్లోని వీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.