
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్కి దిగిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాథమ్ ఏకాగ్రతని చెదరగొట్టేందుకు కోహ్లీ పదేపదే ప్రయత్నించాడు. కానీ లాథమ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. మూడో రోజు 217 పరుగులు భారత్ ఆలౌట్ అయిన అనంతరం.. కివీస్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు లాథమ్, డెవాన్ కాన్వేలు అద్భుతంగా ఆడారు. నిలకడగా ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని విడదీసేందుకు టీమిండియా పేసర్లు అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలోనే కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడు.
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా విసిరిన బంతిని టామ్ లాథమ్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆఫ్ స్టంప్కి వెలుపలగా వచ్చిన బంతి.. అతడి బ్యాట్ అంచున తాకి సిల్లీ పాయింట్ దిశగా వెళ్లింది. వెంటనే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. స్లెడ్జింగ్కి దిగాడు. ;బంతిని ఎలా ఆడాలో లాథమ్కి ఐడియా లేకపోయింది జాస్', 'నువ్వు లాథమ్ను నిలువరించగలుగుతున్నావ్', 'అలానే ఔట్ కూడా చేయగలవు', 'బంతిని బ్యాట్కి మిడిల్ చేయలేకపోతున్నానని లాథమ్కు కూడా తెలుసు', కమ్ ఆన్ జాస్' అంటూ కోహ్లీ మాటల దాడి చేశాడు.
ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఓ బంతిని సిల్లీ మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తల మీదుగా టామ్ లాథమ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ గాల్లోకి ఎగిరిన కోహ్లీ.. ఆ బంతిని అద్భుత క్యాచ్గా అందుకున్నాడు. దీంతో లాథమ్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీతో పాటు యువ ఓపెనర్ శుభమన్ గిల్ కూడా స్లెడ్జింగ్ చేసినా.. లాథమ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. మొత్తానికి పరోక్ష మాటలతో కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో వర్షం కారణంగా ఐదో రోజు, మంగళవారం ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైనా.. భారత్ తొలి సెషన్లో 3 వికెట్లతో న్యూజిలాండ్పై పైచేయి సాధించింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రాస్ టేలర్ (11), బీజే వాట్లింగ్ (1) లను పెవిలియన్ పంపాడు. మధ్యలో హెన్రీ నికోల్స్ను ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో కివీస్ నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 135/5గా నమోదైంది. కేన్ విలియమ్సన్ (19), కొలిన్ గ్రాండ్హోమ్ (0) క్రీజులో ఉన్నారు. కివీస్ ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది.