ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేస్తోంది. ఏడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా బెంగళూరు చెత్త రికార్డు నమోదు చేసింది.
అయితే 287 పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ ఛేదనలో గట్టిపోటీనే ఇచ్చింది. ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనంతరం బెంగళూరుకు అయిదు రోజల విరామం వచ్చింది. దీంతో ఈ సమయాన్ని ఆర్సీబీ ప్లేయర్లు సరదాగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో దినేశ్ కార్తీక్తో ప్రశ్న-జవాబులు అంటూ సరదా ప్రోగ్రామ్ను బెంగళూరు ఫ్రాంచైజీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డీకేతో విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్, రజత్ పటిదార్, మహ్మద్ సిరాజ్ పాల్గొన్నారు. కాగా, ఈ స్టార్ ఆర్సీబీ ప్లేయర్లకు కార్తీక్ ఓ భిన్నమైన ప్రశ్న వేశాడు. 'క్రికెట్లో కాకుండా ఇతర ఆటల్లో నా ఫేవరేట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు?' అని కార్తీక్ అడిగాడు.
కోహ్లి వెంటనే స్పందించి.. 'మీ భార్య' అని బదులిచ్చాడు. దీంతో దినేశ్ కార్తీక్ నోటి వెంట కాసేపు మాట రాలేదు. ఆ తర్వాత 'ఇది కచ్చితంగా గొప్ప సమాధానమే. కానీ నా మైండ్లో వేరే జవాబు ఉంది. కానీ నేను కాదని చెప్పలేని సమాధానమిచ్చావు' అంటూ కార్తీక్ పేర్కొన్నాడు. దినేశ్ కార్తీక్ సతీమణి దీపిక పల్లికల్ ఇండియా టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్. 2015లో దీపికను డీకే వివాహమాడాడు. ఈ జంటకు కబీర్, జియన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.