Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఈ భీకర దాడికి పాల్పడ్డారు. సామాన్యులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. దీంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరూ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధ్యులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా ఈ దాడిని ఖండిస్తూ.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఐక్యంగా కలిసి ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్రికెటర్.. భీకర దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల గురించి ఏం అన్నారో తెలుసుకుందాం..
cricketers comments on Pahalgam Terror Attack: "పహల్గాంలో జరిగిన దాడి వార్త విని నా గుండె విరిగిపోయింది. బాధితులు, వారి కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నారు. వారి గురించే నా ఆలోచనంత. మన దేశంలో ఇలాంటి హింసకు ఎలాంటి చోటు ఉండకూడదు. శాంతి చేకూరాలని ఆశిస్తున్నా" అని కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అన్నారు.
"పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయంలోనే మనమంతా మానవత్వంతో, ఐక్యంగా కలిసి ఉండాలి" అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
