న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీని పోల్చడం సబబు కాదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఎందుకంటే..
సచిన్ టెండూల్కర్.. ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్. అంతకుమించి అభిమానులకు క్రికెట్ దేవుడు.
అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు చేసిన వీరుడు. 200 టెస్టులు, 463 వన్డేల్లో 33,000 పైగా పరుగుల చేసిన యోధుడు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు ఈ లెజెండరీ క్రికెటర్తో పరుగుల యంత్రం విరాట్కోహ్లీని పోలుస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రస్తుత తరంలో విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మనే అయినా సచిన్తో మాత్రం పోల్చవద్దంటున్నారు సెహ్వాగ్ లాంటి సీనియర్లు. 'ఇద్దరు క్రికెటర్లను ఎవరూ పోల్చలేరు. నన్ను సచిన్, వివ్ రిచర్డ్స్తో ఎప్పుడూ పోల్చుతూ ఉండేవారు. కానీ అది సరికాదు. ఎందుకంటే రిచర్డ్స్ ఆడిన కాలం వేరు.. నేనాడింది వేరు. సచిన్, విరాట్ విషయంలో కూడా నా అభిప్రాయం ఇదే' అని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సెహ్వాగ్ చెప్పాడు.

టెస్ట్ కెప్టెన్ విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ఇప్పుడు విరాట్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మన్ అనీ... డేవిడ్వార్నర్, ఏబీ డివిలియర్స్ ఉన్నా అతడు పరుగులు చేస్తున్న విధానం దుర్భేద్యంగా ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్, ఆల్రౌండర్ యువరాజ్సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. సచిన్తో పోల్చి విరాట్పై భారం పెంచొద్దంటున్నారు. 'భారత క్రికెట్ గమనాన్ని మార్చిన ఘనత మాస్టర్ సొంతం. దయచేసి ఇలాంటి పోలికలు చేయొద్దు' కపిల్ సూచించారు.
ఈ తరంలో విరాట్కోహ్లీ అత్యుత్తమం' అని టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్సింగ్ అన్నాడు. సచిన్తో విరాట్ను పోల్చడం అసమంజసమని వివరించాడు. టెండూల్కర్ వారసత్వాన్ని అందుకోవాలంటే కోహ్లీ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది అంటూనే అతడు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నాడు.
ఇది ఇలా ఉండగా, మిగితా విషయాలపై స్పందించిన సెహ్వాగ్.. డే-నైట్ టెస్టులకు భారతలో ఆదరణ లభించే అవకాశం ఉందన్నాడు. తన జీవిత కథ ఆధారంగా సినిమా నిర్మిస్తామని ఎవరూ ముందుకు రాలేదని వీరూ చెప్పాడు. ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కింగ్స్ లెవన్ పంజాబ్.. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడుతుందని ఆశిస్తున్నట్లు ఆ టీమ్ మెంటర్ సెహ్వాగ్ అన్నాడు.
కొన్ని ఉత్కంఠ భరిత మ్యాచ్లను స్వల్ప తేడాతో కోల్పోవడం టీమ్పై ప్రభావం చూపిందన్నాడు. వోహ్రా, గుర్కీరత్, అక్షర్ పటేల్, సాహా లాంటి ఆటగాళ్లకు తన టెక్నిక్లు నేర్పినా.. వారు నిలకడగా రాణించకపోవడంతో పంజాబ్ విఫలమైందన్నాడు. విదేశీ ఆటగాళ్లు ఆమ్లా, మాక్స్వెల్, మిల్లర్ టచ్లోకి రాలేదని.. వారు చెలరేగితే ఎటువంటి మ్యాచ్ అయినా పంజాబ్దే పైచేయని సెహ్వాగ్ చెప్పాడు.