వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్లో పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్ ఈ టోర్నీలో కచ్చితంగా ఆడాలని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అంటున్నాడు.
వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీస్, యూఎస్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టోర్నీలో కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ చాలా అవసరం అని బంగర్ అన్నాడు. గత టీ20 వరల్డ్ కప్లో సెమీస్ చేరిన టీంలో కోహ్లీ కూడా ఉన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆరు మ్యాచుల్లో 296 పరుగులు చేసిన కోహ్లీ.. లీడింగ్ రన్ స్కోరర్గా టోర్నీ ముగించాడు. అతని సగటు 98.67 కాగా, స్ట్రైక్ రేట్ 136.41గా నమోదైంది. అయితే ఈ మెగా ఈవెంట్ తర్వాత సీనియర్లను టీ20ల్లో సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవలే రోహిత్ శర్మ చెప్పాడు. అయితే వచ్చే పొట్టి ప్రపంచ కప్లో కూడా కోహ్లీని ఆడించాలని బంగర్ అంటున్నాడు. 'నూటికి నూరు శాతం కోహ్లీని ఆడించాలి. చివరి వరల్డ్ కప్లో తను ఎలా ఆడాడో మర్చిపోకూడదు. వచ్చే ఏడాది అతన్ని వద్దనడానికి ఎలాంటి కారణం లేదు' అన్నాడు.
'ఎమోషన్స్ చాలా హైలో ఉంటాయి. చిన్న తప్పు చేసినా భారీ నష్టం జరగొచ్చు. అప్పుడు నీ స్ట్రైక్ రేట్ ఎంతున్నా, ఐపీఎల్లో ఏం చేశావనేది అసలు మ్యాటరే కాదు. ఇలాంటి సమయాల్లో అనుభవం చాలా ముఖ్యం. పాకిస్తాన్పై కోహ్లీ ఇన్నింగ్స్ మరెవరూ ఆడలేరు. అక్కడే అతను ఎంత కీలకమో తెలియడం లేదా?' అని బంగర్ ప్రశ్నించాడు.
'ప్రతి బ్యాటర్కూ ఒక్కో స్టైల్ ఉంటుంది. అంటే కేవలం బిగ్ హిట్టర్లే మ్యాచులు గెలిపిస్తారని అనుకోకూడదు. అదే నిజమైతే టీ20 వరల్డ్ కప్లు అన్నీ వెస్టిండీస్ గెలవాలి కదా. విరాట్ కోహ్లీ ఒక్క సిక్సర్ కూడా బాదకుండా సెంచరీ చేయగలడు. అది చాలాసార్లు చేసి చూపించాడు కూడా. అదే అతని సత్తాకు నిదర్శనం' అని బంగర్ మెచ్చుకున్నాడు.