
విరాట్ కోహ్లీ తాను ఔటయ్యే ప్రమాదమున్న షాట్లను ఆడడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అన్నాడు. 33ఏళ్ల కోహ్లీ చాలా సార్లు ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవుతున్నాడు. గురువారం లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో కూడా కోహ్లీ కొంపముంచింది ఇదే షాట్. కోహ్లీ ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని హిట్ చేయాలని చూసి పేసర్ డేవిడ్ విల్లీ బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుటయ్యాడు. అయితే కోహ్లీ రీస్ టోప్లీ బౌలింగ్లో మూడు అద్భుతమైన ఫోర్లతో మంచి టచ్లోకి వచ్చినట్టు కన్పించాడు. కానీ యథావిధిగా తన బలహీనతను కోహ్లీ కొనసాగించాడు. ఇకపోతే ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన రీస్ టోప్లీ ఇంగ్లాండ్కు ఘన విజయాన్ని అందించగలిగాడు.
ఇక జాఫర్ మాట్లాడుతూ.. 'నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ బానే ఆడుతున్నట్లు కనిపించాడు. కానీ ప్రత్యర్థి బౌలర్లు అతనికి తప్పకుండా ఆఫ్ స్టంప్ వెలుపల బాల్స్ వేస్తూనే ఉంటాయి. ఆ విషయాన్ని కోహ్లీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఏరియాలో పడే బంతుల్లో కోహ్లీ పరుగులు పొందలేడు. ఆఫ్ స్టంప్ లెంత్ బంతులు కోహ్లీని బురిడీ కొట్టించగలవు. వాటిని థర్డ్ మాన్ దిశగా కొట్టడానికి వీలవుతుంది. కానీ అది ఇప్పుడు మంచిది కాదు. అతను ఏ డెలివరీలకు ఎలా స్పందించాలో కాస్త జాగ్రత్తపడాలి. వీలయినంత వరకు ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతులను వదిలేస్తే బెటర్' అని జాఫర్ ESPNcricinfoలో పేర్కొన్నారు.
ఇంకా జాఫర్ అభిప్రాయపడుతూ.. 'ప్రతి పేలవ ఇన్నింగ్స్ అతనిపై ఒత్తిడిని పెంచుతూనే ఉంటుంది. బహుశా అతనిలో అనవసర సందేహాలను కూడా రేకెత్తిస్తుంది. ఇక కోహ్లీ గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది అతన్ని కాస్త ప్రెషర్లోకి నెడుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఇక ముందున్న ఇన్నింగ్స్ అతనికి చాలా కీలకం' అని జాఫర్ పేర్కొన్నాడు.