హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి 11వ స్థానంలో నిలవగా... శిఖర్ ధావన్ మూడు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన మూడు టీ20ల సిరిస్లో మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ 72 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టీ20లో 40, మూడో టీ20లో 36 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
'పయోలీ' ఎక్స్ప్రెస్ పీటీ ఉషకు అరుదైన గౌరవం
ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... రెండో టీ20లో టీమిండియా... మూడో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. ఈ జాబితాలో ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్మన్ 727 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో ఓ స్కాట్లాండ్ బ్యాట్స్మన్ 600పైగా పాయింట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ బ్యాట్స్మన్ జార్జి మన్సే 56 బంతుల్లో 127 పరుగులు సాధించాడు. ఇక, భారత పర్యటనలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సపారీ టీ20 కెప్టెన్ క్వింటన్ డీకాక్ 19 స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు.
గత రెండేళ్లలో టీ20ల్లో క్వింటన్ డీకాక్ సాధించిన అత్యధిక ర్యాంకు ఇదే కావడం విశేషం. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో 52 పరుగులు చేసిన క్వింటన్ డీకాక్... బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో 79 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఇక, బౌలర్ల జాబితాలో సఫారీ స్పిన్నర్ తబ్రాయిజ్ షంసీ తొలిసారి టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. ఇక, దక్షిణాఫ్రికా పేసర్ ఫెలుక్వాయో ఏడో స్థానంలో నిలిచి తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు. ఇక, బంగ్లాదేశ్లో జరిగిన ముక్కోణపు సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆప్ఘన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన ఈ సిరిస్లో ముజీబ్ మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జింబాబ్వే కెప్టెన్ హామిల్టన్ మసకజ్ద 22వ ర్యాంకులో నిలిచాడు.