MI VS RCB: విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ.. ప్రస్తుత జనరేషన్లో ఇండియన్ క్రికెట్ ఐకాన్స్. ఐపీఎల్ ఈ ఇద్దరు.. ఒకరు ఆర్సీబీకి ఆడితే - మరొకరు ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలుచుకుని ఛాంపియన్గా నిలిస్తే.. ఒక్కసారైనా టైటిల్ గెలవాలని ఆర్సీబీ ఇంకా పోరాడుతోంది. టైటిల్ విషయంలో ఈ రెండు జట్ల రికార్డులు వేరే అయినప్పటికీ.. క్రేజ్ విషయంలో మాత్రం రెండూ సమానమే. అయితే ఇప్పుడీ రెండు జట్లు.. ఐపీఎల్ 2025లో భాగంగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ హై ప్రొఫైల్ క్లాష్ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అవన్నీ మాట్లాడుకుంటాం..
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు విరాట్ కోహ్లీ. గత 15 ఏళ్లుగా తమ మధ్య ఉన్న స్నేహబంధం, అనుభవాలు, పరస్పర గౌరవం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "ఎక్కువ కాలంగా ఒకరితో పాటు కలిసి ఆడుతున్నప్పుడు, ఆటపై మనకున్న అవగాహనను ఒకరితో మరొకరు పంచుకుంటూ, నేర్చుకుంటూ ఉంటాం. పైగా ఒకే సమయంలో కెరీర్లో ఎదుగుతున్నప్పుడు, ఇలాంటి అనుబంధం చాలా సహజంగా ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు మనం కలిసి చర్చించుకుంటాం. జట్టు నాయకత్వం వహించే విషయంలో మేము చాలా దగ్గరగా కలిసి పని చేశాం. ఎప్పుడూ ఆలోచనలు చర్చించేవాళ్లం. కాబట్టి మేమిద్దరం ఎక్కువగా ఒకే దానికి కట్టుబడి ఉండేవాళ్లం. కలిసి ఉండేవాళ్లం. కాబట్టి ఇద్దరి మధ్య నమ్మకం అనేది ఏర్పడింది. అదే జట్టు కోసం మరింత పనిచేయాలనే స్పూర్తినిచ్చింది." అని విరాట్ అన్నాడు.

అస్సలు ఊహించలేదు..
కోహ్లీ - రోహిత్ మధ్య విభేదాలు, మనస్పర్థలు వచ్చాయని ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ కోహ్లీ మాత్రం మాట్లాడుతూ.. తాను రోహిత్ కలిసి టీమిండియా కోసం 15 ఏళ్ల పాటు కలిసి ఆడతామని అస్సలు ఊహించలేదని అన్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇద్దరి మధ్య ఎన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. "మేము కలిసి ఆడిన సమయాన్ని నిజంగా ఆస్వాదించాం. యుక్త వయసులో ఉన్నప్పుడు.. జాతీయ జట్టులో స్థిరంగా 15 సంవత్సరాలు ఆడతామని మా ఇద్దరిలో ఎవరూ ఊహించలేదు. ఇంత కాలం పాటు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము కలిసి గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం ప్రత్యేకం. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి," అని విరాట్ తమ బంధాన్ని వివరించాడు.