ఆక్లాండ్: తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను కూడా గెలుచుకుంది. వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇక మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు సిద్దమయింది. ఆదివారం ఆసీస్ సిరీస్ పూర్తవ్వగానే భారత జట్టు సోమవారం రాత్రి న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది.
అయ్యో మరియా.. తొలి రౌండ్ నుండే షరపోవా నిష్క్రమణ!!
మంగళవారం భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచర ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకుర్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. 'ఆక్లాండ్ చేరుకున్నాం. లెట్స్ గో శార్దూల్ ఠాకుర్, శ్రేయస్ అయ్యర్' అని కోహ్లీ పోస్టు చేశాడు.
ఈ పర్యటనలో భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్తో పోరు మొదలవుతుంది. గత ఏడాది న్యూజిలాండ్లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్ను 4-1తో గెలుచుకొని.. టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయింది. 2018 ఆసీస్ టూర్ తర్వాత భారత జట్టు మళ్లీ మూడు ఫార్మాట్లలో విదేశీ గడ్డపై ఆడబోతోంది. ఈనేపథ్యంలో కివీస్ పిచ్లపై తమ ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా టెస్టులు, వన్డేల్లో పటిష్ఠమైన లైనప్ కలిగిన భారత్ ఈసారి గట్టి దెబ్బ తీసేందుకు సిద్ధమవుతోంది.
కివీస్ గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ రికార్డు ఏమంత బాగాలేదు. ఇక్కడ ఆడిన 23 టెస్టుల్లో గెలిచింది కేవలం ఐదు మాత్రమే. ఇందులో 8 పరాజయాలు, 10 డ్రాలున్నాయి. 1967లో టెస్టు సిరీస్ను గెలిచాక.. మరో సిరీస్ గెలిచేందుకు 42 ఏళ్లు పట్టింది. వన్డేల్లో 22 మ్యాచ్ల్లో ఓడి 14 గెలిచింది. ఒకటి టై కాగా.. రెండింట్లో ఫలితం రాలేదు. ఇక టీ20 ఫార్మాట్లో ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లోనే విజయం సాధించింది.
స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో గాయపడడంతో అతడు కివీస్ పర్యటనకు దూరమయ్యాడు. దీంతో తొలి మ్యాచ్కు ముందే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ఫార్మాట్లో గబ్బర్ స్థానంలో కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు.