
INDvsAUS : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాజాగా చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ఘనమైన ఆరంభం దక్కిన సంగతి తెలిసిందే. నాగ్పూర్ టెస్టులో భారీ విజయంతో భారత జట్టు ఈ సిరీసులో 1-0 ఆధిక్యం సాధించింది. అదే జోరులో ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో కూడా రాణించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే రెండో టెస్టు కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ఆటగాళ్లంతా చెమటోడ్చారు.
ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఢిల్లీకి వచ్చిన లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేసిన కోహ్లీ.. 'చాలా కాలం తర్వాత ఢిల్లీ స్టేడియం వరకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా. ఎన్నో మదురానుభూతులు గుర్తొస్తున్నాయి' అని తన ఇన్స్టాగ్రాంలో స్టోరీ షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువ భాగం కోహ్లీ ఇక్కడే గడిపాడు. దీంతో ఈ మ్యాచులో అయినా కోహ్లీ తన పూర్వపు ఫామ్ అందుకొని భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తున్నారు.
టెస్టు ఫార్మాట్లో ఫామ్ అందుకోని కోహ్లీ.. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా విఫలమయ్యాడు. అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ వేసిన ఓవర్లో కేవలం 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఈ సిరీసుకు ముందు వన్డేల్లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. ఆసీస్కు కూడా చుక్కలు చూపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ తొలి టెస్టులో అతను విఫలం అవడంతో నిరుత్సాహపడ్డారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడింది. కాబట్టి కోహ్లీపై అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని, ఈ సిరీసు పూర్తయ్యేలోపు అతను ఫామ్ అందుకుంటాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.