ఏ రంగంలో ఒక విద్యార్థి సక్సెస్ సాధించినా అతనిపై కచ్చితంగా గురువుల ప్రభావం ఉంటుంది. క్రీడల్లో అయితే అది మరీ ఎక్కువ. ఈ విషయాన్ని క్రీడాకారులు ఎవరూ ఎప్పుడూ మర్చిపోరు. అందుకే తమ గురువుకు చాలా గౌరవం ఇస్తారు. ఆ కోవకు చెందిన వాడే విరాట్ కోహ్లీ.
ఈ టీమిండియా సూపర్ స్టార్ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ తన కెరీర్లో చిన్ననాటి గురువు రాజ్కుమార్ శర్మ పాత్ర ఎంతో ఉందని చెప్తూనే ఉంటాడు. ఆయనే తన సత్తా గుర్తించాడని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాడు. కోహ్లీకి 9 ఏళ్ల వయసు నుంచే రాజ్కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.

ఆ వయసులోనే కోహ్లీ ట్యాలెంట్ గుర్తించిన రాజ్కుమార్ శర్మ.. అతని కోసం ప్రత్యేకమైన కోచింగ్ రెజిమెన్ తయారు చేశాడు. అలా ప్రత్యేక శ్రద్ధతో కోహ్లీని తీర్చిదిద్దాడు. ఆ శ్రమకు ఫలితగా ప్రపంచం అంతా గర్వపడే గొప్ప ఆటగాడు క్రికెట్కు దక్కాడు. తాజాగా మరోసారి రాజ్కుమార్ శర్మకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.
తన కెరీర్లో రాజ్కుమార్ శర్మ పాత్ర ఎంతో కీలకం అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇన్నేళ్లుగా తనకు మార్గదర్శనం చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. 'కొంతమందికి క్రీడలు ఎప్పుడూ రెండో ఆలోచనగానే మిగిలిపోతాయి. అలాంటిది ఆరంభం నుంచి నీ సత్తాను ఎవరైనా నమ్మితే వాళ్ల గొప్పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం అని నేను ఫీల్ అవుతా' అని కోహ్లీ అన్నాడు.
'నాకు కేవలం కోచ్గానే కాకుండా.. ఒక మెంటార్గా నా క్రీడా ప్రయాణంలో నా వెంటే ఉండి మద్దతుగా నిలిచిన రాజ్కుమార్ శర్మ సర్కు నేను జీవితాంతం రుణపడి ఉంటాను' అని తన గురువుకు ధన్యవాదాలు తెలిపాడు. అక్కడితో ఆగకుండా తనను అందరి కన్నా ఎక్కువగా నమ్మినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు.
'నేను పెద్ద పెద్ద కలలు కన్న పిల్లాడిని. ఆ కలలపై మీరు ఉంచిన నమ్మకం వల్లనే పదిహేనేళ్ల క్రితం నేను టీమిండియా జెర్సీ వేసుకోగలిగా. మీరు నేర్పిన పాఠాలు, ఇచ్చిన సలహాలు, తప్పు చేసినప్పుడు కొట్టిన మొట్టికాయలు, బాగా ఆడినప్పుడు శభాష్ అని వీపు తట్టడం ఇవేమీ నేను మర్చిపోలేను. నా కలలను కూడా మీ కలలుగా మోసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా' అని పోస్టు పెట్టాడు.