
హైదరాబాద్: భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జూన్ 14న బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్న చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ యుగియగానే కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్కు పయనం కానున్నాడు.
కౌంటీ క్రికెట్లో భాగంగా విరాట్ కోహ్లీ సర్రే లేదా ఎసెక్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ ఏడాది జులైలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ ఏడాది సఫారీ పర్యటనకు ముందుగా వెళ్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులోని కీలక ఆటగాళ్లను నెల రోజులు ముందుగానే అక్కడికి పంపనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్కు పయనమవుతున్నాడు. కోహ్లీ ముందుగా వెళ్లి అక్కడ కౌంటీల్లో సర్రే లేదా ఎసెక్స్ జట్టు తరఫున ఆడతాడు.
తద్వారా ఇంగ్లాండ్ పరిస్థితులకు కోహ్లీ అలవాటుపడతాడు. ఇంగ్లాండ్ గడ్డపై బ్యాటింగ్లో రాణించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 14న బెంగళూరులో అఫ్గానిస్థాన్తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం కానున్నాడు. గతంలో కపివల్ దేవ్ కూడా కోహ్లీ కౌంటీల్లో ఆడాలని సూచించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టీమిండియా క్రికెటర్లు ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మలు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. పుజారా కౌంటీల్లో యార్క్షైర్ జట్టు తరఫున ఆడనున్నాడు. కాగా, ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది.
టోర్నీలో భాగంగా కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్ని కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 8న కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో జరగనుంది.