
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించలేదు. దీంతో ఆసీస్ బ్యాటర్లు రాణించారు. పిచ్ నుంచి సహకారం లేకపోయినా కూడా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పరుగులు చేయడం కోసం ఆసీస్ బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది. అయినా సరే ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు రాణిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (104 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. అతనితోపాటు కామెరూన్ గ్రీన్ (49 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్, పీటర్స్ హాండ్స్కోంబ్ కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకోగా.. జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పెద్దగా రాణించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 12, 44, 20,, 22, 13 పరుగులు చేశాడు. అతని నుంచి భారీ స్కోరు ఆశించిన అభిమానులు ఈ ఆటతీరు చూసి నిరాశ చెందారు. కానీ కోహ్లీ మాత్రం మైదానంలో తన టైంను ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా అహ్మదాబాద్ టెస్టులో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తూ స్నాక్స్ తింటూ కనిపించాడు. స్లిప్స్లో ఫీల్డింగ్లో ఉన్న అతను.. కొంచెం టైం దొరకగానే తన దగ్గర ఉన్న ఎనర్జీ బార్ తీసుకొని కరకరలాడించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.