టీ20ల్లో విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్పై చర్చ కొనసాగుతూనే ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి (51; 43 బంతుల్లో) ఆడిన ఇన్నింగ్స్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ విమర్శించాడు.
గవాస్కర్తో పాటు పలు మాజీ క్రికెటర్లు కూడా కోహ్లి ఆటపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లే అనంతరం కోహ్లి దూకుడు తగ్గిపోతుందని, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాడని పేర్కొన్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి బ్యాటుతో పాటు మాటలతోనూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ వేశాడు. 44 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించి విరాట్.. స్పిన్లో 34 బంతుల్లోనే 61 పరుగులు బాదాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ''చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్రేటు గురించి, స్పిన్లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో.. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్లో కూర్చొని మాట్లాడటం సరికాదు'' అని పేర్కొన్నాడు.
కాగా,ఈ పరిస్థితుల్లో కోహ్లికి మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ మద్దతు ఇచ్చారు. కోహ్లి మానవమాత్రుడే అని, పరిస్థితులకు తగ్గట్లుగా అతను ఆడతాడని సపోర్ట్ చేశారు. ''ప్రజలు కోహ్లి స్ట్రైక్రేటు గురించి మాట్లాడుకుంటున్నారని విన్నాను. టీ20ల్లో 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో ఆట స్లోగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్ల ఎకానమీ రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తారు'' అని కైఫ్ పేర్కొన్నాడు.
''కోహ్లి దేవుడు అని ప్రజలు భావిస్తున్నారు. కానీ అతనూ మనిషే. కాబట్టి అతను మనిషిలానే ఆడగలడు. అతని చిన్న పొరపాట్లును వదిలేసి, తన 80 సెంచరీలను మీరు ఎందుకు చూడట్లేదు? అతని బలం, బలహీనతంటూ ఏదీ లేదు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో కోహ్లి ఆటను జాగ్రత్తగా పరిశీలించండి. స్పిన్లో అతను బ్యాక్ ఫుట్పై లాఫ్టెడ్ షాట్లు ఆడుతున్నాడు''
''కోహ్లిలా ఇలా ఎంతమంది ఆడగలరో చెప్పండి? ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్లో అతనిలా మెరుగ్గా ఎవరు ఆడగలరో చెప్పండి? కోహ్లి తన వికెట్కు ఎంతో విలువ ఇస్తాడు. ఇంతకంటే అతనేం చేయాలి?'' అని సిద్ధూ అన్నాడు. కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాపై ప్రభావం చూపుతుందని, టీ20 వరల్డ్ కప్లో ఈ స్టార్ క్రికెటర్ను సెలక్ట్ చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు.. ఐపీఎల్ ప్రారంభంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కోహ్లి స్ట్రైక్రేట్పై చర్చ కొనసాగుతూనే ఉంది.